IPL

New Zealand Squad: Adam Milne Ruled Out of T20 World Cup 2026, Kyle Jamieson Replaces Him

by Guna SRV

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే 2026 టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. SA20 లీగ్‌లో ఆడుతున్న సమయంలో అతడికి హ్యామ్‌స్ట్రింగ్ గాయం కావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మిల్నే స్థానంలో కైల్ జేమీసన్ను జట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

గత ఆదివారం MI కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ తరఫున బౌలింగ్ చేస్తూ మిల్నే తొలి ఓవర్‌లోనే గాయపడాడు. అనంతరం నిర్వహించిన స్కాన్లలో గాయం తీవ్రత బయటపడింది. ఈ టోర్నీలో మిల్నే ఎనిమిది మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అతడి సగటు 16.27 కాగా, ఎకానమీ రేట్ 7.61గా నమోదైంది.

ఈ విషయంపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందిస్తూ,
“ఆడమ్‌కు ఇది చాలా బాధాకరమైన విషయం. టోర్నీకి సిద్ధం కావడానికి అతడు ఎంతో కష్టపడ్డాడు. ఈస్ట్రన్ కేప్ సన్‌రైజర్స్ తరఫున అతడు మళ్లీ తన బెస్ట్ ఫామ్‌లో కనిపించాడు. ఇలాంటి సమయంలో గాయం రావడం దురదృష్టకరం. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం,” అని తెలిపారు.

మిల్నే స్థానంలో జట్టులోకి వచ్చిన కైల్ జేమీసన్ ప్రస్తుతం భారత పర్యటనలో న్యూజిలాండ్ జట్టుతోనే ఉన్నాడు. ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న జేమీసన్‌ను ప్రధాన జట్టులోకి తీసుకువచ్చారు. జనవరి 31 వరకు జట్లలో స్వేచ్ఛగా మార్పులు చేసుకునే అవకాశం ఉండగా, ఆ తర్వాత చేసే మార్పులకు ఐసీసీ అనుమతి అవసరం ఉంటుంది.

జేమీసన్ ఎంపికపై వాల్టర్ మాట్లాడుతూ,
“కైల్ ఇప్పటికే భారత్‌లో మా జట్టుతో ఉండటం మాకు పెద్ద ప్లస్. మా పేస్ బౌలింగ్ విభాగంలో అతడు కీలక ఆటగాడు. ఈ టూర్‌లో అద్భుతంగా ప్రారంభించాడు. అతడి కష్టపడి పనిచేసే తత్వం, అనుభవం టీ20 ప్రపంచకప్‌లో ఎంతో ఉపయోగపడతాయి,” అన్నారు.

గతేడాది బ్యాక్ ఇంజరీ నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగొచ్చిన జేమీసన్, ఈ నెల ప్రారంభంలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ ప్రదర్శన ఇచ్చాడు.

ఇదిలా ఉండగా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే మ్యాట్ హెన్రీ మరియు లాకీ ఫర్గూసన్లు టీ20 ప్రపంచకప్ సమయంలో స్వల్ప కాలం పితృత్వ సెలవులు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించింది.

టోర్నీ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ జట్టులోకి మరో ట్రావెలింగ్ రిజర్వ్‌ను కూడా చేర్చనున్నారు. న్యూజిలాండ్ తమ టీ20 ప్రపంచకప్ ప్రయాణాన్ని ఫిబ్రవరి 8న చెన్నైలో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా ప్రారంభించనుంది. అంతకుముందు ఫిబ్రవరి 6న ముంబైలో USAతో వార్మ్-అప్ మ్యాచ్ ఆడుతుంది. ప్రస్తుతం భారత్‌తో కొనసాగుతున్న టీ20 సిరీస్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.


మరిన్ని వార్తలు చదవండి: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సౌతాఫ్రికా జట్టులో మార్పులు.. రికెల్టన్, స్టబ్స్‌కు ఛాన్స్