IPL

No Handshake Controversy Sparks Debate on Politics in Cricket

by Krishna R

ఐసీసీ అండర్‌–19 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా జనవరి 17న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు పరస్పరం హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన వివాదాస్పద నో హ్యాండ్‌షేక్ ఘటనను ఇది మరోసారి గుర్తు చేసింది.

ఈ సంఘటన తర్వాత క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. క్రికెట్ వర్గాల్లో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎక్కువ మంది క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు మాత్రం దేశాల మధ్య తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు సమర్థనీయం అంటున్నారు.

అభిప్రాయాలు ఎలా ఉన్నా, క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం వల్ల దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి తప్ప ప్రజలకు ఉపయోగపడే ఫలితాలు రావు. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించే వేదికలు. అలాంటి వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం సరికాదు.

ఆటగాళ్లు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. క్రీడలకు సంబంధం లేని అంశాలను పక్కన పెట్టి, మైదానంలో క్రీడాస్ఫూర్తితో ఆడాలి. రాజకీయాల బాధ్యతను నాయకులకు వదిలి, ఆటలో గౌరవం మరియు శిష్టాచారాన్ని కాపాడాలి. నో హ్యాండ్‌షేక్ లాంటి ఘటనలకు తావివ్వకుండా హుందాగా వ్యవహరించాలి.

హ్యాండ్‌షేక్ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. ఇది ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవానికి ప్రతీక. దేశాల మధ్య పోటీ ఉన్నా, సామరస్యాన్ని ప్రతిబింబించే సంకేతం ఇది. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలకు చోటివ్వకూడదు. ప్రత్యర్థికి హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా తిరస్కరిస్తే, అంతర్జాతీయ స్థాయిలో ఆ ఆటగాడి ప్రతిష్ఠ దెబ్బతింటుంది. అప్పటివరకు అభిమానుల నుంచి లభించిన గౌరవం కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది.

క్రికెట్‌ను జెంటిల్‌మన్ గేమ్ అని అంటారు. అందుకే క్రికెటర్లు కూడా జెంటిల్‌మన్‌లా ప్రవర్తించి ఆట గౌరవాన్ని పెంచాలి. దేశాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు నిరసన వ్యక్తం చేయాలంటే, గతంలో చేసినట్లుగా ఆర్మ్‌బ్యాండ్ ధరించడం వంటి సున్నితమైన మార్గాలు ఎంచుకోవచ్చు. కానీ ప్రత్యర్థిని అవమానించే విధంగా హ్యాండ్‌షేక్‌ను నిరాకరించడం మాత్రం సరైంది కాదు.

ఇలాంటి చర్యలు అభిమానుల్లోనే కాదు, సహచర ఆటగాళ్లలో కూడా అసహనాన్ని పెంచుతాయి. ఇటీవల ఒక వెస్టిండీస్ మాజీ టీ20 దిగ్గజం కూడా భారత్ పాకిస్తాన్ నో హ్యాండ్‌షేక్ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతేడాది ఆసియా కప్ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం ఈ చర్చకు కారణమైంది.

ఈ ఘటనతో దేశంలో కొంతమంది అభిమానుల్లో సూర్యకుమార్‌పై గౌరవం పెరిగినా, అంతర్జాతీయంగా మాత్రం ఇది విమర్శలకు దారి తీసింది. కాబట్టి నో హ్యాండ్‌షేక్ వంటి చర్యలు క్రీడల ప్రతిష్ఠను తగ్గిస్తాయి తప్ప, గౌరవాన్ని పెంచవు అనే విషయాన్ని క్రీడాలోకం గుర్తుంచుకోవాలి.

మరిన్నివార్తలుచదవండిU19 వరల్డ్ కప్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం, విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్