IPL

Not Rohit Sharma: KL Rahul Likely to Replace Shubman Gill as ODI Captain for South Africa Series

by Guna SRV

సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం కానున్నాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్ట్‌లో గిల్ గాయపడ్డ విషయం తెలిసిందే. మూడు బంతులు మాత్రమే ఆడిన గిల్… మెడ నరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం విడిచాడు. ఆ తర్వాత నొప్పి తీవ్రంగా పెరగడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

[ Poll: aLoE2Dwr ]

24 గంటల పర్యవేక్షణ అనంతరం గిల్‌ని డిశ్చార్జ్ చేసిన వైద్యులు, రెండో టెస్ట్ కోసం అతను జట్టుతో కలిసి గౌహతికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. అయితే మ్యాచ్ ఆడే స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో, మళ్లీ అతన్ని ముంబైకి పంపినట్లు సమాచారం. గిల్‌కు కొంతకాలం పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకుని…

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026ను దృష్టిలో పెట్టుకుని, గిల్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. అందుకే వన్డే సిరీస్ మొత్తం అతనికి విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచన జట్టు మేనేజ్‌మెంట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వన్డేల్లో గిల్‌కు డిప్యూటీగా ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో జట్టుకు దూరమయ్యాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో క్యాచ్ పట్టే సమయంలో అయ్యర్ పక్కటెముకల భాగంలో తీవ్ర గాయమైంది. ప్లీహంలో వచ్చిన చీలిక కారణంగా ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అయ్యర్ వేగంగా కోలుకుంటున్నా, మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడానికి ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు. అయ్యర్ ఐపీఎల్ 2026తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి.

కెప్టెన్ రోహిత్ కాదు…?

ఈ పరిస్థితుల్లో, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో భారత జట్టును ఎవరు నడిపిస్తారన్నది చర్చనీయాంశమైంది. కొంతమంది రోహిత్ శర్మ మళ్లీ నాయకత్వం వహించే అవకాశం ఉందని భావించినా, సెలెక్టర్లు కేఎల్ రాహుల్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు రాహుల్‌కు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారు. రాహుల్ గతంలో మూడు ఫార్మాట్లలోనూ తాత్కాలిక సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. 12 వన్డేల్లో కెప్టెన్‌గా రాహుల్ భారత్‌కు 8 విజయాలు అందించాడు.

ప్రస్తుతం రాహుల్ వన్డేల్లో రెగ్యులర్ వికెట్ కీపర్‌గా ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతనే ప్రధాన వికెట్ కీపర్‌గా ఉన్నాడు. అతనికి బ్యాకప్‌గా ఉన్న రిషభ్ పంత్ ఎక్కువగా బెంచ్‌కే పరిమితమైపోయాడు.

ధోనీ నగరంలో ప్రారంభం

నవంబర్ 30న ధోనీ స్వస్థలం రాంచీలో తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో రెండో మ్యాచ్, డిసెంబర్ 6న వైజాగ్‌లో మూడో మ్యాచ్ జరగనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఇంకా ప్రకటించలేదు. మరో రెండు రోజులలోపే జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు చదవండి: T20 World Cup 2026: ఆల్‌మోస్ట్ ఫైనల్! టీ20 WC గ్రూప్స్ ఖరారు – భారత్ గ్రూప్‌లో ఉన్న జట్లు ఇవే!