IPL

Pakistan’s T20 World Cup 2026 Participation Decision Expected After PM Meeting

by IPL Web Desk

Pakistan’s T20 World Cup 2026 Participation Decision Expected After PM MeetingT20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ పాల్గొంటుందా లేదా అన్న అంశంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ ఈ రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించింది. భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చాలన్న విజ్ఞప్తికి అనుమతి లభించకపోవడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ పరిణామం తర్వాత పాకిస్తాన్ కూడా ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తుందా అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

వార్తల ప్రకారం, ఆదివారం నాటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ పాల్గొనడంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని జట్టుకు శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేసినప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మొహ్సిన్ నక్వీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రపంచ కప్ అంశంపై విస్తృతంగా చర్చ జరగనుందని సమాచారం. ఆ భేటీ ఫలితమే పాకిస్తాన్ ప్రపంచ కప్‌లో పాల్గొంటుందా లేదా అన్న విషయాన్ని నిర్ణయించనుంది.

జనవరి 26 తేదీన కూడా మొహ్సిన్ నక్వీ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిశారు. మరోవైపు పాకిస్తాన్ ఇరవై ఓవర్ల ప్రపంచ కప్ జెర్సీని ఇప్పటికీ విడుదల చేయలేదు. కొన్ని అనివార్య కారణాలతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు బోర్డు గతంలో తెలిపింది.

WPL 2026 ప్లేఆఫ్స్ రేస్ ఉత్కంఠ – ఒక్క మ్యాచ్‌తో మూడు జట్ల భవితవ్యం

ప్రపంచ కప్‌కు దూరమైతే దేశీయ టోర్నీ ప్లాన్

అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది. ఒకవేళ ప్రపంచ కప్‌లో పాల్గొనకూడదని నిర్ణయిస్తే, లాహోర్‌లో నాలుగు జట్లతో దేశీయ టోర్నీ నిర్వహించనున్నారు. ఇందులో సీనియర్ జట్టు ఆటగాళ్లు, పాకిస్తాన్ షాహీన్స్, పంతొమ్మిదేళ్ల లోపు జట్టు ఆటగాళ్లను నాలుగు జట్లుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు.

భారత్‌కు వెళ్లేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ప్రపంచ కప్‌లోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకునే అవకాశముందని ప్రచారం జరిగింది. ప్రపంచ కప్ జెర్సీ విడుదలను కూడా పాలక మండలి రద్దు చేయడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.

ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సంబంధించిన ఒక ప్రకటనలో, “పాకిస్తాన్ ప్రపంచ కప్ జట్టులో లేని కారణంగా ఒక పేస్ బౌలర్‌ను విడుదల చేస్తున్నాం” అని పేర్కొన్నారు. ఆ ప్రకటనను తర్వాత తొలగించినప్పటికీ, పాకిస్తాన్ నిర్ణయం దాదాపు తీసుకున్నట్టేనన్న సంకేతాలు అందులో కనిపించాయి.

వార్తల ప్రకారం, పాకిస్తాన్ జట్టు ఫిబ్రవరి రెండో తేదీన శ్రీలంకకు ప్రయాణించనుంది. రెండు రోజుల తర్వాత ఐర్లాండ్‌తో సాధన మ్యాచ్ ఆడనుంది. సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని జట్టు గ్రూప్ దశతో పాటు నాకౌట్ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలోనే ఆడేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే…ప్రధానితో జరిగే సమావేశం తర్వాత పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే. అధికారిక ప్రకటన వెలువడే వరకూ ఉత్కంఠ కొనసాగనుంది.

అండర్-19 ప్రపంచకప్ భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ అహ్మద్ ICC నిబంధనలు ఉల్లంఘించాడా?