IPL

Palash Muchhal Files Rs 10 Crore Defamation Case Against Vignan Mane

by Krishna R

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, చిత్ర నిర్మాత పలాష్ ముచ్చల్, మరాఠీ నటుడు మరియు నిర్మాత విజ్ఞాన్ మానేపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. పలాష్‌పై విజ్ఞాన్ చేసిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.

మంగళవారం ముంబై అంధేరి కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలాష్ తన న్యాయవాది శ్రేయాన్ష్ మిఠారేతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. సినిమా పెట్టుబడి పేరుతో తన నుంచి రూ.40 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని విజ్ఞాన్ మానే ఆరోపించారు. అంతేకాదు, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానతో పలాష్‌కు ఉన్న సంబంధం గురించీ కొన్ని ఆరోపణలు చేశారు.

స్మృతి తండ్రి ద్వారా తనకు పలాష్ పరిచయం అయ్యిందని, ఆ తర్వాత సినిమా పెట్టుబడి పేరిట తన నుంచి రూ.40 లక్షలు తీసుకున్నారని మానే తెలిపారు. అయితే ఆ డబ్బును తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే స్మృతి–పలాష్ వివాహం జరగాల్సిన రోజున పలాష్ మరో మహిళతో పట్టుబడ్డాడని, అందుకే ఆ పెళ్లి రద్దయిందని కూడా ఆయన పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై మహారాష్ట్రలోని సాంగ్లి ప్రాంతంలో ఫిర్యాదు నమోదైంది. అయితే ఇప్పటివరకు అధికారిక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని సమాచారం. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఇవి ప్రచారం చేస్తున్నారని పలాష్ స్పష్టం చేశారు. తన న్యాయవాది ద్వారా విజ్ఞాన్ మానేకి రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా పలాష్ మాట్లాడుతూ, తన ఇమేజ్ మరియు కెరీర్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. మరోవైపు, తనకు నోటీసు అందినట్లు విజ్ఞాన్ కూడా ధృవీకరించారు.

పలాష్ – స్మృతి మంధానల వివాహం రద్దు అయిన తర్వాతే ఈ వివాదం బయటకు వచ్చింది. నిజానికి వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి రద్దయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో కొనసాగుతోంది.

మరిన్నివార్తలుచదవండిSA vs WI 1వ టీ20 ప్రివ్యూ 2026: లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్ట్, జట్లు & హెడ్ టు హెడ్