Pat Cummins Hints at Skipping IPL 2027, Prioritizes ODI World Cup and Tests
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టుకు ముందున్న అత్యంత రద్దీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్తో పాటు టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చే ఏడాది కొన్ని త్యాగాలు చేయాల్సి రావొచ్చని కమిన్స్ వెల్లడించారు.
గాయం కారణంగా పలుమాసాలు ఆటకు దూరమైన కమిన్స్, ఐపీఎల్ 2026లో తిరిగి బరిలోకి దిగాడు. అయితే 2027లో తన పనిభారాన్ని సమర్థంగా నిర్వహించుకోవాలంటే కొన్ని టోర్నమెంట్లకు విరామం ఇవ్వాల్సి రావొచ్చని పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్ లేదా వన్డే ప్రపంచకప్ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశాడు. ఐపీఎల్కు దూరమవుతానని నేరుగా చెప్పకపోయినా, ఆ అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేదు.
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఏదో ఒకదానికి విరామం ఇవ్వాల్సిందేనని, అయితే అది టెస్ట్ మ్యాచ్లు లేదా వన్డే ప్రపంచకప్ కాదని తెలిపాడు. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో చర్చించిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు. గాయాల సమస్యలు ఇటీవల ఎదురవుతున్నందున ఇప్పుడే ఏ నిర్ణయానికీ కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదని పేర్కొన్నాడు.
కమిన్స్ను ఇబ్బంది పెట్టిన నడుము గాయం
2026 ఆరంభంలో నడుము ఒత్తిడి గాయంతో కమిన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ గాయం కారణంగా అతడు పలుమాసాలు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఐపీఎల్ 2026 తొలి అర్ధభాగాన్ని కూడా కోల్పోయాడు. ఏప్రిల్ మధ్యలో క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఫిట్నెస్ అనుమతి పొందిన తర్వాతే తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆలస్యంగా జట్టుతో కలిసినప్పటికీ సన్రైజర్స్ తరఫున ఎనిమిది మ్యాచ్లు ఆడి ఎనిమిది వికెట్లు సాధించాడు.
కమిన్స్ గైర్హాజరీలో వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఒకవేళ కమిన్స్ ఐపీఎల్ 2027కు దూరమైతే, తదుపరి కెప్టెన్గా ఇషాన్ కిషన్నే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా జట్టుకు 2027 సంవత్సరం అత్యంత కీలకంగా మారనుంది. జనవరి, ఫిబ్రవరిలో భారత్తో నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అనంతరం మార్చిలో ఇంగ్లండ్తో చారిత్రాత్మక 150వ వార్షికోత్సవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఏడాది చివర్లో యాషెస్ సిరీస్తో పాటు అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ కూడా ఉండటంతో ఆస్ట్రేలియా కెప్టెన్కు విశ్రాంతి తీసుకునే సమయం చాలా తక్కువగా ఉండనుంది.
టెస్ట్ క్రికెట్, వన్డే ప్రపంచకప్లే తన ప్రధాన లక్ష్యాలని కమిన్స్ మరోసారి స్పష్టం చేశాడు. భారత్తో జరిగే పూర్తి టెస్ట్ సిరీస్లో ఆడితే, ఆ తర్వాత కఠినమైన యాషెస్ సిరీస్కు ముందు తప్పనిసరిగా విశ్రాంతి అవసరమవుతుందని చెప్పాడు. దీంతో ఐపీఎల్ 2027కు కమిన్స్ దూరమయ్యే అవకాశాలపై మరింత ఊహాగానాలు మొదలయ్యాయి.