Questions Rise Over Mohammed Siraj’s Exclusion from ODIs – Aakash Chopra Criticises Selectors

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత బౌలర్ల ప్రదర్శన తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లోనూ మన బౌలర్లు విఫలమయ్యారు. ప్రత్యేకంగా పేసర్లు అయితే గల్లీ బౌలర్లకన్నా కూడా నిరుత్సాహకరంగా బౌలింగ్ చేస్తున్నారు.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ఫాస్ట్ బౌలర్ల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. షమీ మాత్రం ఫిట్నెస్ సమస్యల కారణంగా ఎంపిక కాలేకపోతున్నాడు. అయితే సిరాజ్ను ఈ సిరీస్కు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో సెలక్టర్లు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఆసీస్తో వన్డే సిరీస్ ఆడిన సిరాజ్, సఫారీలతో జరిగే వన్డేల నుండి పూర్తిగా దూరంగా ఉంచబడ్డాడు. ఈ ఏడాది అతడు ఇప్పటివరకు ఒక్క వన్డే సిరీస్ మాత్రమే ఆడాడు. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా చోటు కల్పించలేదు. ఈ పరిస్థితులపై మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సిరాజ్ను ఒక్క ఫార్మాట్కు మాత్రమే పరిమితం చేయడంపై ఆకాష్ చోప్రా ప్రశ్నలు లేవనెత్తారు. హైదరాబాదీ బౌలర్ కేవలం టెస్ట్లకే పరిమితం కావాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు.
“మహ్మద్ సిరాజ్ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారు? సెలక్టర్ల వ్యూహాలు అసలు అర్థం కావడం లేదు. సిరాజ్ ఎప్పుడూ ఫిట్గానే ఉంటాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడే సిరాజ్ వన్డేలు ఆడలేడా? ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయకపోవడం కూడా చాలా నిరాశ కలిగించింది.
ఎందుకంటే అతడు ఒకప్పటి వరల్డ్ నంబర్ వన్ వన్డే బౌలర్. అలాంటి బౌలర్ ఇప్పుడు జట్టులో కూడా కనిపించడం లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణల వంటి బౌలర్లకు తరచూ అవకాశాలు ఇస్తారు. కానీ సిరాజ్ మాత్రం వన్డే, టీ20 జట్లలో కనిపించడమే లేదు.
ఇలా ఎందుకు జరుగుతోంది నాకు అర్థం కాదు. కానీ సిరాజ్ ఇప్పుడు సింగిల్ ఫార్మాట్ ప్లేయర్గా మారిపోయాడు” అని చోప్రా వ్యాఖ్యానించాడు.
అదే సమయంలో, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో కూడా సిరాజ్కు స్థానం దక్కలేదు.
మరిన్ని వార్తలు చదవండి: రస్సెల్ ఇక ప్లేయర్గా ఐపీఎల్కి గుడ్బై: రిటైర్మెంట్ వెనుక కారణాలేంటి?