Rahul Dravid Becomes Owner of Dublin Guardians in European T20 Premier League
యూరప్లో తొలిసారిగా ఐసీసీ అనుమతితో నిర్వహించబడుతున్న క్రాస్బోర్డర్ ఫ్రాంచైజీ టీ20 టోర్నమెంట్ అయిన యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)కు భారీ ఊతం లభించింది. భారత మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ విజేత కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ లీగ్లో ఫ్రాంచైజీ ఓనర్గా అధికారికంగా చేరారు. డబ్లిన్ కేంద్రంగా ఏర్పాటైన ఫ్రాంచైజీకి “డబ్లిన్ గార్డియన్స్” అనే పేరు ఖరారు చేశారు. 2026లో జరిగే తొలి సీజన్కు ముందు ఈ ప్రకటనను డబ్లిన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ్తో పాటు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. ఆయన ఈ లీగ్ ప్రమోటర్లలో ఒకరుగా, సహ యజమానిగా కొనసాగుతున్నారు.
ఈటీపీఎల్ టోర్నమెంట్ 2026 ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో జరగనుంది. క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్లతో కలిసి ఈ లీగ్ను నిర్వహిస్తున్నారు. యూరప్లో క్రికెట్కు బలమైన పునాది నిర్మించడం, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం ఈ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యంగా ఉంది.
యూరప్లో క్రికెట్ అభివృద్ధే ద్రావిడ్ లక్ష్యం
ఈ ప్రాజెక్ట్లో చేరడానికి కారణం కేవలం ఫ్రాంచైజీ ఓనర్షిప్ మాత్రమే కాదని ద్రావిడ్ తెలిపారు. యూరప్లో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడే అవకాశం తనను ఆకర్షించిందన్నారు. “యువ ప్రతిభకు అవకాశాలు కల్పించడం, గ్రాస్రూట్ స్థాయిలో క్రికెట్ను బలోపేతం చేయడం ఈ లీగ్ ప్రధాన లక్ష్యం. అదే నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది,” అని ద్రావిడ్ పేర్కొన్నారు. డబ్లిన్లో ఇప్పటికే మంచి క్రికెట్ అభిమాన వర్గం ఉందని, భవిష్యత్తులో అక్కడ క్రికెట్కు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు.
యూరప్లో క్రికెట్ను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అభిమానులకు ప్రత్యేక అనుభవం కల్పించడం కీలకమని ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. “మైదానానికి ప్రేక్షకులు రావాలి. వారికి మంచి అనుభవం ఇవ్వాలి. కేవలం మంచి క్రికెట్ మాత్రమే కాదు, స్టేడియం వాతావరణం కూడా అద్భుతంగా ఉండాలి,” అని చెప్పారు. ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల స్థానిక ఆటగాళ్లు అంతర్జాతీయ స్టార్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎంతో ఉపయోగకరమని ద్రావిడ్ అభిప్రాయపడ్డారు.
ఈటీపీఎల్లో ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్లు ఫ్రాంచైజీ యజమానులుగా చేరడం విశేషం. గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్ గేల్, స్టీవ్ వా, కైల్ మిల్స్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి ప్రముఖులు ఈ లీగ్లో భాగమయ్యారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టోర్నమెంట్పై ఆసక్తి పెరుగుతోంది.
ఈ టోర్నమెంట్లో మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మిచెల్ సాంట్నర్, లియామ్ లివింగ్స్టోన్, హెన్రిచ్ క్లాసెన్, మ్యాక్స్వెల్, డుప్లెసిస్ వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఆడే అవకాశముంది. ఆసక్తికర విషయం ఏమిటంటే మ్యాక్స్వెల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు ఓనర్షిప్ బాధ్యతలతో పాటు ప్లేయర్లుగానూ బరిలోకి దిగనున్నారు. డబ్లిన్ గార్డియన్స్కు రాహుల్ ద్రావిడ్ ఓనర్గా ఉండగా, బెల్ఫాస్ట్ ఫ్రాంచైజీకి గ్లెన్ మ్యాక్స్వెల్, రోహన్ లండ్, ఎడిన్బర్గ్ ఫ్రాంచైజీకి కైల్ మిల్స్, నాథన్ మెకల్లమ్, రాచెల్ వైజ్మన్, గ్లాస్గో ఫ్రాంచైజీకి విపుల్ అగర్వాల్, క్రిస్ గేల్, ఆమ్స్టర్డామ్ ఫ్రాంచైజీకి స్టీవ్ వా, జేమీ డ్వైర్, టిమ్ థామస్, రోటర్డామ్ ఫ్రాంచైజీకి జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్, గ్లాషిన్, సమీర్ షా యజమానులుగా కొనసాగుతున్నారు.