Ranji Trophy 2025-26: Jammu & Kashmir Reach Final for the First Time

జమ్మూ కశ్మీర్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్ మ్యాచ్లో అనూహ్య రీతిలో బెంగాల్ను ఓడించి తమ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండో సెమీఫైనల్లో భాగంగా బెంగాల్ – జమ్మూ కశ్మీర్ మధ్య మ్యాచ్ ఆదివారం బెంగాల్లోని కళ్యాణి వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఘరామి సెంచరీ
మొదట బ్యాటింగ్కు దిగిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులకు ఆలౌట్ అయింది. సుదీప్ కుమార్ ఘరామి 146 పరుగులతో అద్భుత సెంచరీ సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో పేసర్ ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో చెలరేగగా, సునీల్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. యుధ్వీర్ సింగ్ చరఖ్, అబిద్ ముస్తాక్ తలా ఒక వికెట్ సాధించారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన జమ్మూ కశ్మీర్ 302 పరుగులకు ఆలౌట్ అయింది. అబ్దుల్ సమద్ 82 పరుగులతో జట్టును ఆదుకోగా, కెప్టెన్ పారస్ డోగ్రా 58 పరుగులు, ఆకిబ్ నబీ 42 పరుగులు చేసి మెరుగైన ప్రదర్శన చూపించారు. బెంగాల్ తరఫున మొహమ్మద్ షమీ ఎనిమిది వికెట్లు కూల్చి అద్భుత ప్రదర్శన చేశాడు. ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తీశాడు.
చెలరేగిన కశ్మీర్ బౌలర్లు
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్కు జమ్మూ కశ్మీర్ బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. పటిష్టమైన బెంగాల్ బ్యాటింగ్ క్రమాన్ని కేవలం 99 పరుగులకే కుప్పకూల్చారు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సుదీప్ చటర్జీ, సుదీప్ కుమార్ ఘరామి డకౌట్ అయ్యారు. సూరజ్ 14, షాకిర్ హబీబ్ గాంధీ 10 పరుగులు చేశారు. ఈ వికెట్లలో చాలా ఆకిబ్ నబీ ఖాతాలో చేరాయి.
ఇతర బౌలర్లలో సునీల్ కుమార్ నాలుగు వికెట్లు తీసి రాణించగా, యుధ్వీర్ రెండు వికెట్లు సాధించాడు. దీంతో బెంగాల్ విధించిన 126 పరుగుల లక్ష్యాన్ని జమ్మూ కశ్మీర్ నాలుగో రోజు విజయవంతంగా చేధించింది.
చారిత్రక విజయం
లక్ష్య ఛేదనలో శుభం ఖజూరియా 1, యావర్ హసన్ 6, కెప్టెన్ డోగ్రా 9 పరుగులు చేసి త్వరగా ఔటయ్యారు. అయితే శుభం పందిర్ 27 పరుగులు చేసి నిలబడగా, వన్షజ్ శర్మ 43 నాటౌట్, అబ్దుల్ సమద్ 30 నాటౌట్గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు.
మొత్తం నాలుగు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసిన జమ్మూ కశ్మీర్ ఆరు వికెట్ల తేడాతో బెంగాల్పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొత్తంగా తొమ్మిది వికెట్లు తీసిన ఆకిబ్ నబీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
ఈ విజయంతో జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.