IPL

Ranji Trophy 2025: Karnataka Under Pressure Despite KL Rahul’s 59

by Guna SRV

టీమిండియాలో అత్యంత ఆశాజనకమైన బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన కేఎల్‌ రాహుల్‌… దేశవాలీ క్రికెట్‌లోనూ తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఈ సమయంలో రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన కర్ణాటక వికెట్‌కీపర్‌ బ్యాటర్‌… పంజాబ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

క్వార్టర్‌ ఫైనల్‌ ఆశలు నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్‌… 87 బంతుల్లో 59 పరుగులు (9 ఫోర్లు) సాధించి అర్ధ శతకం నమోదు చేశాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 102 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు శుభారంభం అందించాడు.

రాహుల్‌, మయాంక్‌ ఇద్దరూ నిలకడగా ఆడినా… మొత్తం మీద ఈ మ్యాచ్‌లో కర్ణాటక పరిస్థితి కష్టంగానే మారింది. రెండో రోజు టీ విరామానికి కర్ణాటక 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరును అందుకోవాలంటే ఇంకా 110 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంది.

రాహుల్‌ ఔటైన తర్వాత కర్ణాటక బ్యాటింగ్‌ ఒక్కసారిగా కుదేలైంది. స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తోనే కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన దేవదత్‌ పడిక్కల్‌ కేవలం 9 పరుగులకే పెవిలియన్‌ చేరగా, స్మరణ్‌ రవిచంద్రన్‌ కూడా అదే స్కోరుతో నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కేవీ అనీశ్‌ 32 పరుగులతో క్రీజ్‌లో కుదురుకున్నట్టే కనిపించినా… కీలక సమయంలో ఔటయ్యాడు.

ప్రస్తుతం శ్రేయస్‌ గోపాల్‌ (17), కృతిక్‌ కృష్ణ (20) కర్ణాటక ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ బ్రార్‌ నాలుగు వికెట్లు తీసి కర్ణాటక బ్యాటింగ్‌ను తీవ్రంగా దెబ్బకొట్టాడు. అలాగే ఎమన్‌జోత్‌ సింగ్‌ చహల్‌ కీలకమైన మయాంక్‌ అగర్వాల్‌ వికెట్‌ను పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

అంతకుముందు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ అభిజీత్‌ గార్గ్‌ 81 పరుగులు, ఎమన్‌జోత్‌ సింగ్‌ చహల్‌ 83 పరుగులతో అర్ధ శతకాలు సాధించి జట్టును ఆదుకున్నారు. కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ 44 పరుగులతో సహకరించగా, అన్మోల్‌ మల్హోత్రా (25), ఆయుష్‌ గోయల్‌ (23), సుఖ్‌దీప్‌ బజ్వా (20) రెండంకెల స్కోర్లతో తోడ్పడ్డారు.

కర్ణాటక బౌలర్లలో విద్యాదర్‌ పాటిల్‌ నాలుగు వికెట్లు తీయగా, శ్రేయస్‌ గోపాల్‌ మూడు, మొహిసిన్‌ ఖాన్‌ రెండు, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌ ఫలితం కర్ణాటక క్వార్టర్‌ ఫైనల్‌ అవకాశాలపై కీలక ప్రభావం చూపనుంది.