IPL

Rare Honour for Harmanpreet Kaur: PCA Stadium Stand to Be Named After Her

by IPL Web Desk

హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గుర్తింపు: పీసీఎ స్టేడియంలో స్టాండ్‌కు ఆమె పేరుభారత మహిళా క్రికెట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు ఇప్పుడు అక్షరాలా చరిత్రగా నిలిచిపోనుంది. ముల్లాంపూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ పీసీఎ స్టేడియంలో ఆమె పేరుతో ఒక స్టాండ్ ఏర్పాటు చేయనున్నట్టు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. భారత మహిళల తొలి వన్డే వరల్డ్ కప్‌ను అందించిన తర్వాత వచ్చే ఈ గౌరవం, ఏ క్రికెటర్‌కైనా లభించే అత్యున్నత గుర్తింపులలో ఒకటి. మహిళా క్రికెట్ ప్రయాణంలో ఇది నిజంగా చారిత్రాత్మక మైలురాయి.

ఇటీవలి వరల్డ్ కప్‌లో ఆమె నాయకత్వం దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. భారత్-శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇచ్చిన ఈ వరల్డ్ కప్‌లో, కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల సరసన వరల్డ్ కప్‌–విన్నింగ్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ పేరు నిలిచింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై మహిళల వన్డే చరిత్రలోనే అత్యంత పెద్ద ఛేజ్‌ను సాధించి, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన తర్వాత దేశవ్యాప్తంగా సెలబ్రేషన్లు మొదలయ్యాయి.

నవంబర్ 28న సిఎన్న్ న్యూస్18 కార్యక్రమంలో పాల్గొన్న హర్మన్‌ప్రీత్ ఈ సమాచారాన్ని స్వయంగా ధృవీకరించింది. పీసీఎ నుండి అధికారిక లేఖ కూడా అందినట్టు ఆమె చెప్పింది. ఈ నిర్ణయంతో దేశంలో ఏ మహిళా క్రికెటర్‌కు లభించని గౌరవం ఆమెదైంది స్టేడియంలో స్టాండ్‌కి ఆమె పేరు పెట్టడం ఆమె ఆటపై ఉన్న ప్రభావానికి నిదర్శనం.

×
Harmanpreet Kaur Allrounder

స్టేడియాల్లో మహిళా క్రికెటర్లకు గౌరవం పెరుగుతోంది

భారత్ వరల్డ్ కప్ గెలిచి నెల కూడా పూర్తికాకముందే ఈ గౌరవం రావడం ప్రత్యేకం. 2005, 2017 ఫైనల్స్‌లో తృటిలో చేజారిన కప్‌ను ఈసారి భారత్ దక్కించుకుంది. సెమీఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొట్టి గెలవడంలో జెమీమా రొడ్రిగ్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, ఆమెకు హర్మన్‌ప్రీత్ కీలకంగా తోడైంది.

తన విజయాన్ని గుర్తుచేసుకుంటూ, వరల్డ్ కప్ ఎత్తిపట్టడం చిన్నతనం నుంచే కల అని హర్మన్‌ప్రీత్ చెప్పింది. మహిళా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో బీసీసీఐ, కార్యదర్శి జయ్ షా అందించిన మద్దతును ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించింది. పే పరిటీ, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వంటి నిర్ణయాలు ఈతరం ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆమె పేర్కొంది.

ఈ విజయాల జాబితాలో తాజాగా మరో గౌరవం చేరింది. సిఎన్న్–న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ వేడుకలో హర్మన్‌ప్రీత్ “చాంపియన్ ఆఫ్ ది వరల్డ్” అవార్డును అందుకున్నారు. మిథాలీ రాజ్, ఝూలన్ గోస్వామిలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. తాజాగా విజయవాడ స్టేడియంలో మిథాలీ, రవి కల్పన పేర్లతో స్టాండ్లు ఏర్పాటు చేసిన తర్వాత, ఇప్పుడు ముల్లాంపూర్ స్టేడియంలో హర్మన్‌ప్రీత్ పేరు చేరడం మహిళా క్రికెట్‌కు మరో గర్వకారణం.

డిసెంబరు చివర్లో శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత మహిళా జట్టు మళ్లీ మైదానంలో అడుగుపెడుతుంది. చారిత్రాత్మక వరల్డ్ కప్ విజయానంతరం ఇది వారి తొలి సిరీస్.