Ravichandran Ashwin Slams ICC Over T20 World Cup 2026 Format

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు చేశారు. ఐసీసీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి తీరని నష్టం చేస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ మెగా టోర్నీని అభిమానులు పెద్దగా చూడరని, దాంతో వ్యూయర్షిప్ తీవ్రంగా పడిపోతుందని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 వరకు భారత్ మరియు శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. ఈ టోర్నీ షెడ్యూల్పై తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించిన అశ్విన్, గ్రూప్ దశలో భారత్ మ్యాచ్లను అసోసియేట్ దేశాలతో షెడ్యూల్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మ్యాచ్లు ఎక్కువగా ఏకపక్షంగా సాగి, టోర్నీపై అభిమానుల ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.
ఈసారి టీ20 ప్రపంచకప్ 2026ను ఎవరూ ఆసక్తిగా చూడరని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఇండియా వర్సెస్ యూఎస్ఏ, ఇండియా వర్సెస్ నమీబియా వంటి మ్యాచ్లు ప్రపంచకప్కు అభిమానులను దూరం చేసేలా ఉంటాయని అన్నారు.
ఒకప్పుడు ప్రపంచకప్ టోర్నీలు నాలుగేళ్లకు ఒకసారి జరిగేవని, ఆ కారణంగా ఆ టోర్నీపై సహజంగానే ఎంతో ఆసక్తి ఉండేదని గుర్తు చేశారు. అప్పట్లో తొలి రౌండ్లలోనే భారత జట్టు ఇంగ్లండ్, శ్రీలంక వంటి పటిష్టమైన జట్లతో తలపడేదని, ఆ మ్యాచ్లు ఎంతో ఉత్కంఠభరితంగా సాగేవని చెప్పారు.
తాను స్కూల్లో చదువుతున్న రోజుల్లో 1996, 1999, 2003 వన్డే ప్రపంచకప్లు నాలుగేళ్లకు ఒకసారి జరిగాయని అశ్విన్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రపంచకప్ కార్డులు సేకరించడం, మ్యాచ్ షెడ్యూల్స్ ప్రింట్ తీసుకోవడం, వార్తాపత్రికల కట్టింగ్స్ను దాచుకోవడం వంటి అనుభవాలు అభిమానుల్లో ప్రపంచకప్పై మరింత ఆసక్తిని పెంచేవని తెలిపారు. మ్యాచ్ల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే ఆ నిరీక్షణే ప్రపంచకప్ను ప్రత్యేకంగా నిలబెట్టేదని అశ్విన్ అన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 నుంచి 20 జట్లు బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్లను ఐదు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అయితే 2014, 2016, 2021, 2022 టీ20 ప్రపంచకప్లలో టాప్ ర్యాంక్ జట్లు నేరుగా సూపర్ 10 లేదా సూపర్ 12 దశకు అర్హత సాధించేవి. మిగతా అసోసియేట్ దేశాలు ప్రాథమిక గ్రూప్ దశ ఆడి వచ్చేవి. కోవిడ్ కారణంగా 2020లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ 2021కి వాయిదా పడగా, ఆ తరువాతి టోర్నీలు మాత్రం రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు.
మరిన్నివార్తలుచదవండి: టెస్టుల్లో బౌలింగ్తోనే సిరీస్లు గెలుస్తాం: గిల్కు ఊతప్ప కీలక సూచనలు