RCB Women Crowned WPL 2026 Champions After Beating Delhi Capitals
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్–2026 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ తమ ఖాతాలో వేసుకుంది. గురువారం వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ, రెండోసారి డబ్ల్యూపీఎల్ ఛాంపియన్గా అవతరించింది.
ఈ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుతంగా రాణిస్తూ కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెకు తోడు లారా వోల్వార్డ్ 25 బంతుల్లో 44 పరుగులు, చినెల్ హెన్రీ 15 బంతుల్లోనే 35 పరుగులు చేసి ఢిల్లీ ఇన్నింగ్స్కు వేగం తెచ్చారు. ఆర్సీబీ బౌలింగ్లో అరుంధతి, సత్ఘరే, నడైన్ డిక్లార్క్ తలా ఒక్క వికెట్ సాధించారు.
అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ, కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ, కెప్టెన్ స్మృతి మంధానా మరియు జార్జియా వోల్ జట్టును అద్భుతంగా ముందుకు నడిపించారు.
స్మృతి మంధానా 41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 87 పరుగులు చేసి మ్యాచ్ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. మరో వైపు జార్జియా వోల్ 53 బంతుల్లో 79 పరుగులతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆర్సీబీ విజయానికి బలమైన పునాది వేశారు. వడోదర మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తూ ఢిల్లీ బౌలింగ్ను చీల్చిచెదరగొట్టారు.
అయితే వరుసగా వోల్, రిచా ఘోష్, స్మృతి మంధానా వికెట్లు పడటంతో ఢిల్లీ మ్యాచ్లోకి తిరిగి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ 19వ ఓవర్లో రాధా యాదవ్ ఇచ్చిన కీలక క్యాచ్ను మిన్ను మణి జారవిడవడం ఢిల్లీకి భారీ దెబ్బగా మారింది.
చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 9 పరుగులు అవసరమైన సమయంలో రాధా యాదవ్ వరుసగా రెండు ఫోర్లు బాది జట్టును విజయ తీరానికి చేర్చింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్కు మాత్రం ఫైనల్లో ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.