IPL

Riyan Parag Breaks Silence: Emotional Reaction After Missing Out on India T20 Squad

by Guna SRV

సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు చోటు లభించలేదు. ఈ విషయంపై రియాన్ తాజాగా స్పందించాడు. జట్టులో స్థానం దక్కకపోవడం తనకు నిరాశ కలిగించిందని చెప్పాడు.

గత ఏడాది అక్టోబర్‌లో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన రియాన్, భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యానని తెలిపాడు. తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడు రెండు వైట్‌బాల్ ఫార్మాట్లలోనూ భారత్ కోసం ఆడగల సామర్థ్యం ఉన్న ఆటగాడినని, త్వరలోనే జట్టులో తిరిగి కనిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

రియాన్ మాటల్లో—
“నాకు టీమిండియాలో ఆడగల అర్హత ఉందనిపిస్తుంది. ఇది నాపై నాకున్న నమ్మకమో, లేక కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు. అయితే భుజం గాయం వల్ల ప్రస్తుతం జట్టులో లేను. నేను రెండు వైట్‌బాల్ ఫార్మాట్లలో భారత్‌కు ఆడగలను," అని చెప్పాడు.

ఫామ్ పెద్ద సమస్య కాదు

ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ20 టోర్నీలో ఆడుతున్న రియాన్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా రాలేదు. ఈ విషయంపై కూడా ఆయన స్పందించాడు.

“ఫామ్ అనేది పెద్ద సమస్య కాదు. నేను పూర్తిగా ఫిట్ అయితే ఫామ్ ఆటోమేటిక్‌గా వస్తుంది” అని రియాన్ చెప్పాడు.

“బాత్రూంలో కూర్చొని ఏడ్చాను”

“ఇదే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెండు సీజన్లలో నేను 45–50 సగటుతో పరుగులు చేశాను. కానీ వెంటనే జరిగిన ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో కలిపి 70 పరుగులు కూడా చేయలేకపోయాను. ఆ సమయంలో ఎంతో కృంగిపోయాను. బాత్రూమ్‌లో కూర్చొని ఎందుకు పరుగులు చేయలేకపోతున్నానో ఆలోచిస్తూ ఏడ్చాను,” అని రియాన్ చెప్పాడు.

“ఈ ఫామ్‌కి ఐపీఎల్‌తో సంబంధం లేదు”

“సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఫామ్ ఉన్నా లేకపోయినా, అది ఐపీఎల్ ప్రదర్శనపై పెద్ద ప్రభావం చూపదు. ఇక్కడ పరుగులు వస్తే మంచిదే, రాకపోయినా ఐపీఎల్‌లో విఫలమవుతానని కాదు. ఈ విషయంపై నాకు మంచి అనుభవం ఉంది,” అని రియాన్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం 24 ఏళ్ల రియాన్ పరాగ్ చివరిసారిగా 2024 అక్టోబర్ 12న బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా సీఎస్‌కేకు మారిన తర్వాత, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. గత సీజన్‌లో కొన్నిమ్యాచ్‌లలో అతను కెప్టెన్సీ కూడా నిర్వహించాడు. టీమిండియా నుంచి తప్పించబడిన తర్వాత కూడా, రియాన్ ఐపీఎల్ 2025లో మంచి ప్రదర్శన చేశాడు 32 సగటుతో 393 పరుగులు సాధించాడు.

మరిన్ని వార్తలు చదవండి: రస్సెల్ ఇక ప్లేయర్‌గా ఐపీఎల్‌కి గుడ్‌బై: రిటైర్మెంట్ వెనుక కారణాలేంటి?