IPL

Robin Uthappa Advice to Shubman Gill on Bowling Strength in Tests

by Guna SRV

బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను గెలవొచ్చుగానీ, పటిష్టమైన బౌలింగ్‌తోనే సిరీస్‌లను కైవసం చేసుకోవచ్చని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో టీమిండియా బౌలర్లను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశాడు.

ఇదిలా ఉండగా, భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ పర్యటనతో తన నాయకత్వ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇంగ్లండ్ గడ్డపై బ్యాటర్‌గా అద్భుతంగా రాణించిన గిల్, కెప్టెన్‌గా ఆండర్సన్–టెండుల్కర్ ట్రోఫీని 2–2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత స్వదేశంలో అతడి నాయకత్వంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది.

అయితే, ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో మాత్రం టీమిండియా తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. సఫారీలు ఈ సిరీస్‌ను 2–0తో గెలుచుకుని భారత్‌ను వైట్‌వాష్ చేశారు.

ఈ సిరీస్‌లో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ప్రధానంగా బ్యాటర్‌గా మాత్రమే ఉపయోగించింది. అతడికి బౌలింగ్ చేసే అవకాశాలు చాలా పరిమితంగా లభించాయి. మరోవైపు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతడి సామర్థ్యానికి తగిన విధంగా వినియోగించుకోలేకపోయింది.

గిల్ నమ్మకం చూపించాలి: ఊతప్ప

ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్‌కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.
“కెప్టెన్ శుబ్‌మన్ గిల్, నువ్వు వాషింగ్టన్ సుందర్‌పై మరింత నమ్మకం ఉంచాలి. ఇలాంటి ఆటగాళ్లకు బౌలింగ్ కూడా బ్యాటింగ్‌లాగే సహజంగా వస్తుంది. వాషీ తాను అద్భుతంగా బౌలింగ్ చేయగలనని నమ్ముతాడు. ఆ నమ్మకం నీకూ ఉండాలి” అని ఊతప్ప పేర్కొన్నాడు.

భారత క్రికెట్ ముఖ్యంగా టెస్టుల్లో ముందుకు వెళ్లాలంటే వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఆయన సూచించాడు. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లలో ఆడిస్తూ, ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించాల్సిన అవసరం ఉందన్నాడు.

“బ్యాటింగ్‌తో మనం మ్యాచ్‌లను గెలవగలం. కానీ బౌలింగ్ పటిష్టంగా ఉంటేనే సిరీస్‌లను గెలుచుకోగలం. బౌలర్లకు తమను తాము నిరూపించుకునే అవకాశాలు ఇవ్వాలి. కుల్దీప్ యాదవ్‌తో కనీసం 20 నుంచి 25 ఓవర్లు బౌలింగ్ చేయించాలి. అతడి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి” అని ఊతప్ప స్పష్టం చేశాడు.

ఇదిలా ఉండగా, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 0–2తో కోల్పోయిన టీమిండియా, ఆ తర్వాత వన్డే సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకుంది. తదుపరి న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే మరియు టీ20 సిరీస్‌లు ఆడనుంది.

మరిన్నివార్తలుచదవండి2026లో రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఐదుగురు టీమిండియా క్రికెటర్లు