Robin Uthappa on Rohit Sharma and Virat Kohli Test retirement

టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఏడాది మే నెలలో ముందుగా రోహిత్ శర్మ తన టెస్టు రిటైర్మెంట్ను ప్రకటించగా, కొద్దిరోజులకే విరాట్ కోహ్లి కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఇద్దరూ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయారు.
రోహిత్ శర్మ మధ్యలో విరామాలు తీసుకుంటూ మ్యాచ్లు ఆడగా, విరాట్ కోహ్లి ఆఫ్ స్టంప్ వెలుపలికి వెళ్లే బంతులను ఆడే క్రమంలో పలుమార్లు వికెట్లు కోల్పోయాడు. దాదాపు ఎనిమిది సార్లు అదే తరహా అవుట్లకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిల ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ టెస్టులకు స్వస్తి పలికితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవ్వగా, కోహ్లి తన లోపాలను సరిదిద్దుకుంటే మళ్లీ పాత ఫామ్కు వస్తాడనే విశ్లేషణలు వినిపించాయి.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 నుంచి 2027 సీజన్లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్, కోహ్లి ఆడతారని మొదట సంకేతాలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఇద్దరూ టెస్టులకు గుడ్బై చెప్పారు. రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టగా, బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన నాలుగో స్థానాన్ని కూడా అతడే భర్తీ చేశాడు.
ఈ ఆకస్మిక రిటైర్మెంట్లపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది సహజమైన రిటైర్మెంట్లా తనకు అనిపించలేదని, ఏదో ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాల్లా కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో అసలు నిజం ఏంటో రోహిత్, కోహ్లిలే బయటపెట్టాలని చెప్పాడు.
రోహిత్ శర్మ ఆరు నెలల పాటు విరామం తీసుకుని ఫిట్నెస్ పెంచుకుని తిరిగి వచ్చి ఉంటే మళ్లీ ఫామ్ అందుకునే అవకాశం ఉండేదని ఊతప్ప అన్నాడు. అతడిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని, అదే విధంగా కోహ్లి కూడా కొంతకాలం బ్రేక్ తర్వాత తిరిగి వచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.
అలాగే ఇద్దరి ప్రస్తుత ఫామ్పై మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధించాడని, కోహ్లి వరుసగా రెండు శతకాలు బాదాడని గుర్తు చేశాడు. ఇద్దరూ రాబోయే ప్రపంచకప్కు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని చెప్పాడు.
ఇటీవలే రోహిత్ను కలిసినట్లు తెలిపిన ఊతప్ప, అతడు ప్రస్తుతం రిలాక్స్డ్ మూడ్లో ఉండి ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాడని అన్నాడు. రోహిత్, కోహ్లిలకు ఇంకా పరుగుల దాహం తీరలేదని, దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఇంకా ముందుకు వెళ్లాలనే పట్టుదల వారిని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
మరిన్నివార్తలుచదవండి: 2025 టెస్ట్ క్రికెట్ టాప్ 10 రన్స్కోరర్స్: శుభ్మన్ గిల్, KL రాహుల్, యశస్వి జైస్వాల్