Rohit Sharma to Miss Vijay Hazare Trophy 2025 Despite BCCI Directive

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని షాక్ ఇచ్చాడు. దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ–2025 సీజన్కు అతడు అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ అధికారికంగా వెల్లడించాడు.
ప్రస్తుతం టీమిండియాలోని ప్రతి క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీలో తప్పనిసరిగా పాల్గొనాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. సాధ్యమైతే ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్లు ఆడాలని, లేదంటే తమ తమ దేశవాళీ జట్ల తరఫున కనీసం రెండు మ్యాచ్లైనా ఆడాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది.
డిసెంబరు 24 నుంచి ప్రారంభమయ్యే ఈ దేశవాళీ వన్డే టోర్నీ నేపథ్యంలో, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సహా టీమిండియా సీనియర్ ఆటగాళ్లంతా ఈ నిబంధనను పాటించాలని బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. అయితే గాయంతో బాధపడుతూ ఆటకు అనర్హులైన ఆటగాళ్లు మాత్రమే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ‘అన్ఫిట్’ సర్టిఫికెట్ తీసుకొస్తే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.
ఈ క్రమంలో ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టులో విరాట్ కోహ్లి పేరు కనిపించింది. మరోవైపు, ముంబై క్రికెట్ అసోసియేషన్ మాత్రం టీమిండియా సీనియర్ ఆటగాళ్లలో చాలా మంది విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో లేరని వెల్లడించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ విషయంలో ప్రశ్న ఎదురుకావడంతో, సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించాడు.
అందుబాటులో లేరని స్పష్టం
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ సంజయ్ పాటిల్,
“ముంబై జట్టుకు చెందిన టీమిండియా ఆటగాళ్లలో ప్రస్తుతం ఎవరూ మాకు అందుబాటులో లేరు. అలాంటి పరిస్థితిలో వారిని జట్టులో చేర్చడం సరైంది కాదు. అందుకే వారి స్థానాల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం” అని తెలిపారు.
ఆశ్చర్యకరంగా, రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. గతంతో పోలిస్తే మరింత సన్నబడి, మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లోనూ అతడు అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ, విజయ్ హజారే ట్రోఫీకి అతడు ఎందుకు అందుబాటులో లేడన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్తో బిజీగా ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు శివం దూబే కూడా ముంబై జట్టుకు దూరంగా ఉండనున్నారు.
టీ20 ప్రపంచకప్ దృష్ట్యా సడలింపు
2026 టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని, ఈ ఆటగాళ్లు పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండడం, గాయాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం. అందుకే వారికి సడలింపు ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు, దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనారోగ్య కారణంగా విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు.
ఇక గాయాల నుంచి కోలుకుంటున్న ముంబై మాజీ కెప్టెన్ అజింక్య రహానే కూడా ఈ టోర్నీకి అందుబాటులో ఉండడం లేదు. అలాగే శ్రేయస్ అయ్యర్ పరిస్థితి కూడా ఇదే అని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలో ముంబై జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ తదితర యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇషాన్ ముల్చందానికి తొలిసారిగా ముంబై జట్టులో అవకాశం లభించింది.
విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ దశ మ్యాచ్లు డిసెంబరు 24 నుంచి జనవరి 8 వరకు జరగనున్నాయి.
మరిన్ని వార్తలు చదవండి: 500 వికెట్లు, 500 సిక్సర్లు, 5,000 పరుగులు: ‘త్రిపుల్ 500’ ఘనత సాధించిన తొలి ఆటగాడు