Rohit Sharma to Receive Honorary Doctorate from D Y Patil University

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. అజీంక్య డివై పాటిల్ యూనివర్సిటీ నుంచి ఆయనకు గౌరవ డాక్టరేట్ డి లిట్ ప్రదానం చేయనున్నారు. శనివారం జనవరి 24న జరిగే పదవ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఈ సన్మానం జరగనుంది.
క్రీడారంగంలో రోహిత్ చేసిన అసమాన సేవలు, అనేక మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తిత్వాన్ని గుర్తించి ఈ గౌరవాన్ని అందజేయనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. అభిమానులు ప్రేమగా హిట్మ్యాన్ అని పిలిచే రోహిత్కు ఇది అతని కెరీర్లో మరొక గొప్ప మైలురాయిగా నిలవనుంది.
ఈ వేడుకకు విశ్వవిద్యాలయ అధ్యక్షుడు మరియు ఛాన్సలర్ డాక్టర్ అజీంక్య డి వై పాటిల్ అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖులతో నిండి ఉండనుందని, ప్రధాన ఆకర్షణగా రోహిత్ శర్మ ఉంటారని యూనివర్సిటీ ప్రకటించింది.
ప్రస్తుతం రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఆయన టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికారు. అలాగే 2025లో ఇంగ్లాండ్ సిరీస్కు ముందు టెస్ట్ క్రికెట్ నుంచీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత పూర్తిస్థాయి క్రికెట్కు వీడ్కోలు చెప్పే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి.
టెస్ట్ కెరీర్లో రోహిత్ మొత్తం 67 మ్యాచ్లు ఆడి 4 వేల 301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. 2013లో ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్పై టెస్ట్ అరంగేట్రం చేసిన రోహిత్, గతేడాది మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆయన నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్కు చేరింది. కెప్టెన్గా 24 టెస్టుల్లో భారత్ 12 విజయాలు సాధించి, తొమ్మిది మ్యాచ్ల్లో ఓడింది, మూడు డ్రాలుగా ముగిశాయి.
టీ20 ఫార్మాట్లో 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ 4 వేల 231 పరుగులు చేశారు. కెప్టెన్గా భారత్కు 2024 టీ20 వరల్డ్ కప్ను అందించారు. అలాగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి ఒకే ఏడాదిలో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్గా గుర్తింపు పొందారు.
వన్డే క్రికెట్లో ఇప్పటివరకు 282 మ్యాచ్లు ఆడి 11 వేల 577 పరుగులు సాధించారు. 2023 వన్డే వరల్డ్ కప్ మరియు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్కు టీమిండియాను నడిపించిన నాయకుడిగా కూడా రోహిత్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
మరిన్నివార్తలుచదవండి: ఐపీఎల్ 19వ సీజన్ షెడ్యూల్ త్వరలో విడుదల... ఎన్నికల తర్వాతే నిర్ణయం