SA20 League 2025-26: Pollard Leads MI Cape Town to Crucial Win

సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025–26లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కేప్టౌన్ (MI Cape Town) ఈ సీజన్లో అనూహ్య పరాజయాలతో ఎలిమినేషన్ అంచుకు చేరింది. ఇలాంటి కష్ట సమయంలో జట్టుకు దిగ్గజ టీ20 ఆటగాడు కీరన్ పోలార్డ్ అండగా నిలిచాడు. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ జాతీయ విధుల నిమిత్తం జట్టును వీడటంతో, అతని స్థానంలో బాధ్యతలు చేపట్టిన పోలార్డ్.. జనవరి 16న సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్తో జరిగిన మ్యాచ్లో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
అప్పటికే ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కేప్టౌన్.. పోలార్డ్ రాకతో మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఇప్పటికే పార్ల్ రాయల్స్, సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకోగా.. చివరి బెర్త్ కోసం ఎంఐ కేప్టౌన్, జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
సన్రైజర్స్పై జరిగిన ఈ మ్యాచ్లో పోలార్డ్ ముందుగా బంతితో 2 ఓవర్లు వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆపై బ్యాటింగ్లో 14 బంతుల్లో 20 పరుగులు (2 ఫోర్లు) చేసి జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు. ఈ మ్యాచ్లో కేప్టౌన్ మూడు వికెట్ల తేడాతో ఈస్ట్రన్కేప్ను ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్రన్కేప్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. కేప్టౌన్ బౌలర్లలో కార్బిన్ బాష్ నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ను తనవైపు తిప్పాడు. అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బాష్కు తోడు ట్రెంట్ బౌల్ట్ (4–0–28–3), కగిసో రబాడ (3–0–20–1), జార్జ్ లిండే (4–0–34–1) సమర్థంగా బౌలింగ్ చేయడంతో ఈస్ట్రన్కేప్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. చివర్లో మార్కో జన్సెన్ 42 పరుగులతో రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ను చేరగలిగింది. ఈస్ట్రన్కేప్ తరఫున స్టార్ బ్యాటర్లు డికాక్ (0), బెయిర్స్టో (15), స్టబ్స్ (4) పూర్తిగా విఫలమయ్యారు.
లక్ష్య ఛేదనలో కేప్టౌన్ కూడా ఆరంభంలో తడబడింది. ఈస్ట్రన్కేప్ బౌలర్లు జన్సెన్ (4–0–23–2), ముత్తుసామి (3.2–0–25–2), నోర్జే (4–0–29–1), మిల్నే (3–0–26–1), కోల్స్ (2–0–13–1) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేప్టౌన్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే కీలక సమయంలో జార్జ్ లిండే (31) మరియు కీరన్ పోలార్డ్ (20) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి జట్టును గెలిపించారు. అంతకుముందు రిజా హెండ్రిక్స్ 41 పరుగులతో కీలక సహకారం అందించాడు. ఫలితంగా కేప్టౌన్ తీవ్ర ఒత్తిడిలోనూ గట్టెక్కి విలువైన విజయాన్ని సొంతం చేసుకుంది.
మరిన్ని వార్తలు చదవండి: సూర్యకుమార్ యాదవ్ వివాదం: ఖుషీ ముఖర్జీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా