Shikhar Dhawan Second Marriage Wedding with Sophie Shine in February

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అతని ప్రేయసి సోఫీ షైన్ను త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా శిఖర్ ధావన్, సోఫీ షైన్ల వివాహం ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ వివాహ వేడుకకు భారత క్రికెట్ ప్రపంచానికి చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారని హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు సమాచారం.
శిఖర్ ధావన్ జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయం అని, ఈ వివాహాన్ని సానుకూల వాతావరణంలో జరుపుకోవాలని ఇద్దరూ భావిస్తున్నారని ధావన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. పెళ్లి ఏర్పాట్లను శిఖర్ ధావన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడని కూడా పేర్కొన్నారు.
గత వివాహ జీవితం
శిఖర్ ధావన్ గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని 2011లో వివాహం చేసుకున్నాడు. ఆయేషా డివోర్సీ అయినవారు కాగా, ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరికీ జొరావర్ ధావన్ అనే కుమారుడు జన్మించాడు. ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట 2023లో విడాకులు తీసుకుంది.
విడాకుల అనంతరం పదకొండేళ్ల కుమారుడు జొరావర్ తల్లి ఆయేషాతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. తన కుమారుడిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం కూడా లేకపోవడంతో, ఈ విషయంలో తన ఆవేదనను శిఖర్ ధావన్ పలుమార్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
శిఖర్ జీవితంలోకి వచ్చిన సోఫీ షైన్
విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న శిఖర్ ధావన్ జీవితంలోకి ఐర్లాండ్కు చెందిన సోఫీ షైన్ వచ్చింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా దుబాయ్లో వీరిద్దరూ తొలిసారిగా కలిసి కనిపించడంతో వారి ప్రేమ బంధం బహిర్గతమైంది.
ఆ తరువాత నుంచి శిఖర్ ధావన్, సోఫీ షైన్ కలిసి పలు సందర్భాల్లో బయట కనిపిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించారు. మార్కెటింగ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన సోఫీ, ఓ ప్రముఖ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్నట్లు సమాచారం. మరోసారి ప్రేమను వెతుక్కున్న గబ్బర్ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.
శిఖర్ ధావన్ క్రికెట్ ప్రస్థానం
2010 నుంచి 2022 వరకు భారత జట్టుకు సేవలందించిన శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప గుర్తింపు సంపాదించాడు. అతను 34 టెస్టుల్లో 2315 పరుగులు, 167 వన్డేల్లో 6793 పరుగులు, 68 టీ20 మ్యాచ్ల్లో 1759 పరుగులు చేశాడు.
ఓపెనర్గా అతని ఖాతాలో టెస్టుల్లో 7, వన్డేల్లో 17 సెంచరీలు ఉన్నాయి. జట్టులో అవకాశాలు తగ్గడంతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధావన్, ఆపై ఐపీఎల్కూ గుడ్బై చెప్పాడు.
ఇకపై గబ్బర్ జీవితంలో అంతా మంచే జరగాలని, శిఖర్ ధావన్ మరియు సోఫీ షైన్ వివాహ బంధం కలకాలం నిలవాలని అభిమానులు హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నారు.
మరిన్నివార్తలుచదవండి: ఒకే ఓవర్లో 48 పరుగులు.. 7 సిక్సర్లతో చరిత్ర సృష్టించిన సెదికుల్లా అటల్