Shreyas Iyer Injury Update: Out for Two Months After Australia ODI Series

ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్కు పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో రెండు నెలలు పట్టనుంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, సాధారణ పనులు చేయడానికి, తేలికపాటి వ్యాయామాలు ప్రారంభించడానికి డాక్టర్లు అనుమతి ఇచ్చారు.
అయితే, స్ప్లీన్పై ఒత్తిడి పెంచే పనులను పూర్తిగా మానుకోవాలని సూచించారు. మరో రెండు నెలల తర్వాత యూఎస్జీ స్కాన్ చేసిన అనంతరం రిహాబిలిటేషన్ ప్రారంభమవుతుంది. దీంతో రాబోయే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వన్డే సిరీస్లను అయ్యర్ పూర్తిగా మిస్సవ్వడం ఖాయమైంది.
ఆస్ట్రేలియా సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్న శ్రేయాస్ అయ్యర్, సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో నేలను బలంగా తాకడంతో తీవ్ర గాయానికి గురయ్యాడు. అంతర్గత రక్తస్రావం కారణంగా ఐసీయూలో ఉంచి చికిత్స చేసిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశారు.
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇటీవల అతనికి అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్ చేయగా, ఆ రిపోర్టులను ప్రముఖ క్రీడా వైద్య నిపుణుడు డాక్టర్ దిన్షా పెర్డివాలా పరిశీలించారు. గాయం మానుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం అయ్యర్ సాధారణ పనులు, చిన్న చిన్న వ్యాయామాలు చేయొచ్చని వైద్యులు స్పష్టం చేశారు. కానీ స్ప్లీన్పై ఒత్తిడి పెంచే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని గట్టిగా హెచ్చరించారు.
మరో రెండు నెలల తర్వాత అయ్యర్కు మళ్లీ యూఎస్జీ స్కాన్ చేయనున్నారు. ఆ రిపోర్టులు పూర్తిగా సానుకూలంగా వచ్చినప్పుడు మాత్రమే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో అధికారిక రిహాబిలిటేషన్ ప్రారంభించనున్నారు. ఈ లెక్కన చూస్తే, మరో రెండు నుంచి మూడు నెలలు అయ్యర్ క్రికెట్కి దూరంగా ఉండాల్సిందే.
29 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ టీమిండియా కీలక మిడిలార్డర్. ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసి వాల్యుబుల్ ప్లేయర్గా నిలిచాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా ప్రస్తుతం అతన్ని ప్రధానంగా వన్డే ఫార్మాట్కే ఎంపిక చేస్తున్నారు.
అయితే, ఈ ఫార్మాట్లో కూడా వరుస గాయాలు అయ్యర్ను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. రానున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 నాటికి పూర్తిగా ఫిట్గా తిరిగివస్తాడనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి: T20 వరల్డ్ కప్ 2026: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న