Shreyas Iyer Makes Strong Comeback with Fifty in Vijay Hazare Trophy

భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, ముంబై స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పోటీ క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టిన తొలి మ్యాచ్లోనే తన క్లాస్ చూపించాడు. తీవ్ర గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు మైదానానికి దూరమైన శ్రేయస్, జనవరి 6న హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025–26 మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. తిరిగి వచ్చిన వెంటనే మెరుపు అర్ధశతకంతో అభిమానులను అలరించాడు.
ఈ మ్యాచ్లో శ్రేయస్ కేవలం 36 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. గాయానంతరం ఆడిన తొలి మ్యాచ్లోనే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం ద్వారా తన ఫిట్నెస్, ఆత్మవిశ్వాసం రెండింటినీ చాటాడు.
శ్రేయస్తో పాటు ముషీర్ ఖాన్ కూడా అద్భుతంగా రాణించాడు. ముషీర్ 73 పరుగులతో జట్టుకు కీలక సహకారం అందించాడు. వీరిద్దరి చక్కటి బ్యాటింగ్తో 29 ఓవర్ల ముగిసే సరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.
అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ మ్యాచ్ను 33 ఓవర్లకే పరిమితం చేశారు. ముంబై ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 15, సర్ఫరాజ్ ఖాన్ 21, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేశారు. చివర్లో శివమ్ దూబే 20, హార్దిక్ తామోర్ 13 పరుగులతో క్రీజ్లో నిలిచారు.
శ్రేయస్ అయ్యర్ గాయానికి సంబంధించిన నేపథ్యం చూస్తే, గతేడాది అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో అతడు ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ను పట్టగలిగినా, పడిపోయిన వెంటనే తీవ్రమైన నొప్పితో బాధపడాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే సిడ్నీలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. మొదట గాయం పెద్దది కాదని అనుకున్నా, ఆ తర్వాత వైద్యులు అసలు విషయం వెల్లడించారు.
శ్రేయస్ ప్లీహంలో చీలిక ఏర్పడి అంతర్గత రక్తస్రావం జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు పరిస్థితిపై స్పష్టత ఇవ్వలేమని కూడా చెప్పారు. అయితే దైవానుగ్రహం, వైద్యుల సమయోచిత చికిత్స వల్ల శ్రేయస్ ప్రాణాపాయం నుంచి బయటపడి క్రమంగా కోలుకున్నాడు.
ఆ తర్వాత నెలరోజుల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వైద్యుల పర్యవేక్షణలో పునరావాస చికిత్స తీసుకున్న శ్రేయస్, తాజాగా పోటీ క్రికెట్ ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాడు. త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్లో శ్రేయస్ టీమిండియా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆ సిరీస్కు సన్నాహకంగా విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడాలని నిర్ణయించారు.
హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్ తర్వాత జనవరి 8న పంజాబ్తో జరిగే మ్యాచ్లో కూడా శ్రేయస్ పాల్గొననున్నాడు. ఈ రెండు మ్యాచ్ల్లో ముంబై జట్టును ముందుండి నడిపించే బాధ్యత అతనిదే. ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ పిక్క గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో, ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ శ్రేయస్ అయ్యర్కు అప్పగించింది.
మరిన్ని వార్తలు చదవండి: అండర్-19 యూత్ వన్డే సిరీస్లో భారత్ విజృంభణ | సౌతాఫ్రికాపై 2-0తో సిరీస్ కైవసం