Shreyas Iyer Set for Comeback Ahead of New Zealand ODI Series

న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు ఒక శుభవార్త అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్ర గాయానికి గురై కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
దాదాపు రెండు నెలల విరామం తర్వాత, డిసెంబర్ 24 (బుధవారం) శ్రేయాస్ అయ్యర్ తన తొలి బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సుమారు గంటపాటు నెట్స్లో సాధన చేసిన అయ్యర్ ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ పూర్తి చేశాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ముంబైలో ఉన్న అయ్యర్, మరో ఒకటి రెండు రోజుల్లో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ నాలుగు నుంచి ఆరు రోజుల పాటు ప్రత్యేక శిక్షణలో పాల్గొననున్నాడు. అనంతరం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చెందిన వైద్య బృందం అతడికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనుంది.
ఈ పరీక్షల్లో అయ్యర్ ఉత్తీర్ణత సాధిస్తే, న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కివీస్తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.
అయ్యర్కు గాయం ఎలా జరిగింది అంటే?
అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయాస్ అయ్యర్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయానికి గురయ్యాడు. ఆ గాయంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలిపోవడంతో అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు.
మూడు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అయ్యర్, తదుపరి చికిత్స కోసం ముంబైకి తిరిగొచ్చాడు. అక్కడ డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకున్నాడు. దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఇప్పుడు పూర్తిగా కోలుకున్న అయ్యర్ మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించడంతో అతడి రీ-ఎంట్రీపై ఆశలు పెరిగాయి. ఫిట్నెస్ను పూర్తిగా నిరూపించుకుంటే, విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున కూడా అతడు బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.
మరిన్ని వార్తలు చదవండి: డ్రీమ్11 వెళ్లినా లాభాలే.. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐ