Shubman Gill-Gautam Gambhir Introduce New Blueprint for Home Tests
భారత్ స్వదేశంలో వరుసగా ఎదుర్కొన్న టెస్ట్ పరాజయాలు జట్టు వ్యూహాలపై పెద్ద ప్రభావం చూపించాయి. 2024లో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో వైట్వాష్ కావడం, 2025లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ కోల్పోవడం తర్వాత భారత జట్టు యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంది. కెప్టెన్ శుభమాన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఇకపై అతిగా తిరిగే పిచ్లకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.
ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చక్రంలో మిగిలిన స్వదేశ టెస్ట్ల కోసం నల్లమట్టి, మిశ్రమ మట్టి, సంప్రదాయ భారత పిచ్లను ఉపయోగించాలనే ప్రణాళికను సిద్ధం చేసింది. ముల్లాన్పూర్లో ఆఫ్ఘానిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్ట్ ఈ కొత్త వ్యూహానికి తొలి పరీక్షగా భావిస్తున్నారు. ఇక ప్రధాన లక్ష్యం మాత్రం ఆస్ట్రేలియాతో జరిగే తదుపరి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమవ్వడమే.
దక్షిణాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్లో ఎదురైన ఘోర ఓటమి భారత యాజమాన్యానికి పెద్ద హెచ్చరికగా మారింది. కోల్కతా టెస్ట్ కేవలం ఎనిమిది సెషన్ల్లోనే ముగియగా, భారత్ 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. న్యూజిలాండ్ సిరీస్ అనంతరం వెస్టిండీస్తో జరిగిన స్వదేశ సిరీస్లో సమతుల్య పిచ్లను ఉపయోగించినప్పటికీ, మళ్లీ దక్షిణాఫ్రికా సిరీస్లో అతిగా తిరిగే పిచ్లను సిద్ధం చేయడం జట్టుకే నష్టంగా మారింది.
“లాటరీ పిచ్లకు” చెక్ పెట్టాలన్న భారత యాజమాన్యం
ఇకపై మొదటి రోజు నుంచే విరిగిపోయే “లాటరీ పిచ్లకు” దూరంగా ఉండాలని భారత యాజమాన్యం భావిస్తోంది. ఐదు రోజుల పాటు నిలకడగా ఉండే, బ్యాటింగ్-బౌలింగ్కు సమాన అవకాశాలు కలిగిన వికెట్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ముల్లాన్పూర్, నాగ్పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్ వేదికలను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ మైదానాల్లో ఎర్రమట్టి, నల్లమట్టి, మిశ్రమ మట్టి పిచ్లను సిద్ధం చేసే అవకాశం ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఆఫ్ఘానిస్థాన్తో ముల్లాన్పూర్ టెస్ట్లో నల్లమట్టి పిచ్ను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ప్రస్తుతం ఉన్న తీవ్రమైన ఎండల కారణంగా ఎర్రమట్టి పిచ్ వేస్తే అది త్వరగా చిట్లిపోయే ప్రమాదం ఉందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముఖ్యంగా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్న ఆఫ్ఘానిస్థాన్పై అలాంటి పిచ్ ప్రమాదకరంగా మారవచ్చని అంచనా వేస్తోంది. నల్లమట్టి పిచ్ అయితే తొలి రోజుల్లో స్థిరంగా ఉండి, తర్వాత క్రమంగా బౌలర్లకు సహకరిస్తుందని భావిస్తున్నారు.
బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ క్యూరేటర్ మాట్లాడుతూ, నల్లమట్టి పిచ్లు ఇప్పుడు అత్యుత్తమ ఎంపికగా కనిపిస్తున్నాయని తెలిపాడు. ఇవి మొదటి రోజు నుంచే అతిగా తిరగకుండా, క్రమంగా పాడై బౌలర్లకు సహకరిస్తాయని వివరించాడు. చివరి నిమిషంలో పిచ్ స్వభావాన్ని మార్చే ప్రయత్నాలు జట్టుకు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయని కూడా స్పష్టం చేశాడు. స్వదేశంలో తిరిగే పిచ్లపై భారత బ్యాటర్లు ఇటీవల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, వారికి ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు ఐదు రోజుల టెస్ట్ క్రికెట్కు సరిపోయే సమతుల్య పరిస్థితులను సృష్టించడమే ఈ కొత్త వ్యూహం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.