SMAT 2025: Rohit Sharma Set to Return to Domestic T20s, Major Boost for Mumbai

టీమిండియా సీనియర్ స్టార్ రోహిత్ శర్మ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ముగిసిన వెంటనే దేశవాలీ టీ20 టోర్నమెంట్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఆడేందుకు హిట్మ్యాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రోహిత్ తన హోం టీమ్ ముంబై తరఫున నాకౌట్ మ్యాచ్లలో ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై, SMAT నాకౌట్స్కు చేరువైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ముంబైకి రోహిత్ చేరితే, వారిని ఆపడం చాలా కష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత సీజన్లో ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ టైటిల్ అందించాడు.
ప్రస్తుత ముంబై జట్టు మరింత బలంగా ఉంది. టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ వంటి భారత క్రికెటర్లు జట్టులో ఉన్నారు. వీరితో పాటు హిట్మ్యాన్ దిగితే ముంబై దాదాపు అప్రతిహతంగా మారుతుంది.
ఈ సీజన్లో ముంబై ఆటగాళ్లు అంతా అద్భుత ఫామ్లో ఉన్నారు. యువ ఓపెనర్ మాత్రే వరుసగా రెండు సెంచరీలు బాదుతూ సంచలన ఫామ్లో ఉంటే, సర్ఫరాజ్ ఖాన్ కూడా తాజాగా ఓ మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో మెరుపు స్పెల్ వేశాడు.
ఇక మరోవైపు, టెస్ట్లు మరియు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ 38 ఏళ్ల వయసులోనూ తన క్లాస్తో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ, హాఫ్ సెంచరీతో మెరిసిన హిట్మ్యాన్, ప్రస్తుతం సౌతాఫ్రికా సిరీస్లో కూడా ఓ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనుంది.
సిరీస్ విషయానికి వస్తే… రాయ్పూర్లో జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసినప్పటికీ ఓటమిపాలైంది. రుతురాజ్, కోహ్లి సెంచరీలు వృథా అయ్యాయి. సౌతాఫ్రికా బ్యాటర్లు అద్భుత ధీటైన ప్రతిఘటన చూపించి, భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. అంతకుముందు తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.
మరిన్ని వార్తలు చదవండి: IND vs SA 2nd ODI: భారీ స్కోర్ చేసిన భారత్కు షాక్.. రెండు సెంచరీలు వ్యర్థం!