
రికార్డుల రారాణి, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మరో అద్భుత ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా పదివేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
ఈ మైలురాయిని అందుకోవడానికి మంధనకు కేవలం 281 ఇన్నింగ్స్లే సరిపోవడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉండగా, ఆమె 291 ఇన్నింగ్స్లలో పదివేల పరుగులు పూర్తి చేసింది.
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో డిసెంబర్ 28న స్మృతి మంధన ఈ ఘనతను అందుకుంది. ఈ మ్యాచ్లో ఆమె 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి అభిమానులను అలరించింది. వ్యక్తిగతంగా 28 పరుగుల వద్ద ఆమె పదివేల పరుగుల మైలురాయిని చేరుకుని చరిత్ర సృష్టించింది.
మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో పదివేల పరుగులు పూర్తి చేసిన నాలుగో క్రికెటర్గా స్మృతి మంధన నిలిచింది. ఆమెకు ముందు భారత్కు చెందిన మిథాలీ రాజ్ 10868 పరుగులతో, న్యూజిలాండ్కు చెందిన సూజీ బేట్స్ 10652 పరుగులతో, ఇంగ్లండ్కు చెందిన చార్లోట్ ఎడ్వర్డ్స్ 10273 పరుగులతో ఈ ఘనత సాధించారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన 48 బంతుల్లో 80 పరుగులు చేయగా, షఫాలీ వర్మ 46 బంతుల్లో 79 పరుగులు చేసి శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు.
వారి జోరుతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. చివర్లో రిచా ఘోష్ 16 బంతుల్లో 40 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు మరింత బలాన్ని చేకూర్చింది.
ఇదిలా ఉండగా, స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో భారత్ వరుసగా విజయం సాధించడంతో, ఇంకా రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది.
మరిన్నివార్తలుచదవండి: న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ అవుట్? ఇషాన్ కిషన్కు లక్కీ ఛాన్స్