IPL

Smriti Mandhana-led RCB dominate WPL 2026, qualify for playoffs

by Krishna R

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. స్మృతి మంధాన సారథ్యంలో ఆర్‌సీబీ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి, ఈ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. సోమవారం వడోదర వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో తలపడిన ఆర్‌సీబీ సమష్టిగా రాణించి 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు గ్రేస్ హ్యారీస్ (1), జార్జియా వోల్ (1) త్వరగానే పెవిలియన్‌కు చేరడంతో జట్టు ఆరంభంలోనే ఒత్తిడిలో పడింది. కెప్టెన్ స్మృతి మంధాన (26) కూడా భారీ స్కోర్ చేయలేకపోయినా, ఆమె గౌతమి నాయక్‌తో కలిసి మూడో వికెట్‌కు కీలకమైన 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

ఆ తర్వాత గౌతమి నాయక్ అసలు ఆట చూపించింది. రిచా ఘోష్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడిస్తూ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించింది. 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గౌతమి నాయక్ ఆత్మవిశ్వాసంతో ఆడుతూ సెంచరీ వైపు దూసుకెళ్తుండగా, అష్లే గార్డ్‌నర్ బౌలింగ్‌లో ఆమె ఔటయ్యింది. గౌతమి 55 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 73 పరుగులు చేసి జట్టు స్కోర్‌కు బలమైన పునాది వేసింది. చివరి ఓవర్లలో రాధా యాదవ్ (17) వేగంగా పరుగులు రాబట్టగా, నదినే డి క్లేర్క్ (4 నాటౌట్), శ్రేయాంక పాటిల్ (8 నాటౌట్) కూడా కీలక సహకారం అందించారు.

178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. కెప్టెన్ అష్లే గార్డ్‌నర్ మాత్రమే పోరాటం చేసి 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 54 పరుగులు సాధించినా, మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. బెత్ మూనీ (3), సోఫీ డివైన్ (0), అనుష్క శర్మ (18), కనిక అహుజా (0), కాశ్వీ గౌతమ్ (4), జార్జియా వేర్‌హామ్ (2), భార్టి కన్వార్ (14) లు వరుసగా విఫలమయ్యారు. ఫలితంగా గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 117 పరుగులకే పరిమితమైంది.

ఆర్‌సీబీ బౌలర్లలో సయాలి సత్ఘరే అద్భుతంగా రాణించింది. ఆమె 3 వికెట్లు తీసి గుజరాత్ జెయింట్స్ పతనానికి ప్రధాన కారణమైంది. నదినే డి క్లేర్క్ రెండు వికెట్లు తీయగా, లారెన్ బెల్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తలో వికెట్‌తో తమ వంతు పాత్ర పోషించారు.

ఈ విజయంతో ఐదు మ్యాచ్‌లకు ఐదు గెలిచిన ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. లీగ్ దశను టాప్‌లో ముగిస్తే ఆర్‌సీబీ నేరుగా ఫైనల్‌కు చేరనుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా ఫైనల్ బెర్త్ ఖాయం కావడం ఆర్‌సీబీకి మరో పెద్ద ప్లస్‌గా మారింది.

మరిన్ని వార్తలు చదవండి: పీఎస్‌ఎల్ 2026లో భారీ మార్పులు డ్రాఫ్ట్ రద్దు ప్లేయర్ ఆక్షన్ అమలు