IPL

Smriti Mandhana Signs Contract with Manchester Super Giants for The Hundred 2026

by Guna SRV

భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌లో జరగనున్న ది హండ్రెడ్ 2026 సీజన్ కోసం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో ఆమె ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ విషయాన్ని సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ గురువారం అధికారికంగా ప్రకటించింది. గత సీజన్ వరకు ఈ జట్టు మాంచెస్టర్ ఒరిజినల్స్‌గా కొనసాగింది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో 70 శాతం వాటాను కొనుగోలు చేయడంతో జట్టు పేరు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా మారింది.

ఈ జట్టులో ఇప్పటికే మెగ్ లానింగ్, సోఫీ ఎకిల్‌స్టోన్ వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు స్మృతి మంధాన కూడా జట్టులో చేరడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

స్మృతికి ది హండ్రెడ్ టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. గతంలో ఆమె సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2022 సీజన్‌లో సదరన్ బ్రేవ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఆమె నిలిచింది.

ఇక మాంచెస్టర్ పురుషుల జట్టులో జోస్ బట్లర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఏడాది ది హండ్రెడ్ సీజన్ జూలై 21 నుంచి ప్రారంభం కానుంది.

మరిన్నివార్తలుచదవండిరంజీ ట్రోఫీ 2025–26 హైదరాబాద్ జట్టు ప్రకటన మహ్మద్ సిరాజ్ కెప్టెన్‌గా నియామకం