Suryakumar Yadav Controversy: Actress Khushi Mukherjee Faces ₹100 Crore Defamation Case

టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పేరు తాజాగా వివాదంలోకి లాగబడింది. నటి, మోడల్ ఖుషీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆమెపై ఏకంగా రూ.100 కోట్ల పరువు నష్టం దావా నమోదు అయింది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు సూర్యకుమార్ యాదవ్ బహిరంగంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయినప్పటికీ, సూర్యకు అభిమానిని అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ఖుషీపై కోర్టును ఆశ్రయించాడు.
అసలు ఏమైంది?
గత ఏడాది (2025) చివర్లో ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఖుషీ ముఖర్జీ మాట్లాడుతూ.. తాను ఏ క్రికెటర్తోనూ డేటింగ్ చేయాలనుకోవడం లేదని చెప్పింది. అదే సమయంలో పలువురు క్రికెటర్లు తన వెంటపడేవారని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు తరచూ మెసేజ్లు చేసేవాడని, అయితే ఇప్పుడు అతడు పెద్దగా మాట్లాడటం లేదని చెప్పుకొచ్చింది. తనకూ అతడిని మళ్లీ కలవాలనే ఆసక్తి లేదని, ప్రస్తుతం తాను ఎలాంటి రిలేషన్లోనూ లేనని స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఖుషీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి స్పందిస్తూ.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సూర్యకుమార్ యాదవ్తో ఎలాంటి ప్రేమ సంబంధాలు లేవని, కేవలం పరిమితమైన స్నేహపూర్వక సంభాషణ మాత్రమే జరిగిందని వివరణ ఇచ్చింది. అయినా కూడా ఆమెపై విమర్శల దాడి తగ్గలేదు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం.
రూ.100 కోట్ల పరువు నష్టం దావా
ఈ వివాదంలోకి తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్కు చెందిన ఫైజన్ అన్సారీ రంగంలోకి దిగాడు. తాను సూర్యకుమార్ యాదవ్కు పెద్ద అభిమాని అని పేర్కొన్న అతడు, ఖుషీ ముఖర్జీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఖుషీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, సూర్య గురించి తనకు బాగా తెలుసని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పబ్లిసిటీ కోసమే ఓ స్టార్ క్రికెటర్ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడారని ఆరోపించాడు.
ఫామ్ కోల్పోయి ఇబ్బందుల్లో సూర్య
ఇదిలా ఉండగా, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఫామ్ సమస్యలతో సతమతమవుతున్నాడు. 2025 ఏడాదిలో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. మొత్తం 21 మ్యాచ్ల్లో 13.62 సగటుతో కేవలం 218 పరుగులే చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు, జనవరి 21 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో అయినా సూర్య తన పాత ఫామ్ను తిరిగి అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.