Syed Mushtaq Ali Trophy 2025-26: Prithvi Shaw Appointed as Maharashtra Captain

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025–26 ప్రారంభానికి ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్కు జట్టు నాయకుడిగా ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షాను నియమించింది. రెండు రోజుల క్రితమే 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంసీఏ ప్రకటించిన విషయం తెలిసిందే.
సాధారణంగా ఈ టోర్నీలో మహారాష్ట్రకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించాల్సి ఉంది. అయితే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం రుతురాజ్ను భారత సెలక్టర్లు ఎంపిక చేయడంతో, ఆయన ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టుకు కొత్త కెప్టెన్ను నియమించడం తప్పనిసరైంది.
ఈ విషయాన్ని ఇప్పటికే పృథ్వీ షాకు తెలియజేసినట్లు సమాచారం. ఎంసీఏ అధికారికంగా నవంబర్ 24న ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా పృథ్వీకి మంచి అనుభవం ఉంది. గతంలో ఫస్ట్క్లాస్, లిస్ట్-ఎ క్రికెట్లో ముంబై తరఫున అనేక మ్యాచ్లకు ఆయన సారథ్యం వహించాడు.
రంజీ ట్రోఫీ 2025–26 సీజన్ ప్రారంభానికి ముందు పృథ్వీ షా ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన విషయం తెలిసిందే. ముంబై క్రికెట్ అసోసియేషన్తో వచ్చిన విభేదాల కారణంగా షా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
మహారాష్ట్రకు చేరిన తర్వాత పృథ్వీ అసాధారణ ఫామ్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుత రంజీ సీజన్లో ఆయన 7 ఇన్నింగ్స్లు ఆడి 67.14 సగటుతో 470 పరుగులు చేశారు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజున మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్లో జమ్మూ & కాశ్మీర్ను ఎదుర్కోనుంది.
మహారాష్ట్ర జట్టు (Syed Mushtaq Ali Trophy 2025–26)
రుతురాజ్ గైక్వాడ్
నిఖిల్ నాయక్
పృథ్వీ షా
రాహుల్ త్రిపాఠి
రామకృష్ణ ఘోష్
రాజవర్ధన్ హంగర్గేకర్
జలజ్ సక్సేనా
అజీమ్ కాజీ
అర్షిన్ కులకర్ణి
ముఖేష్ చౌదరి
విక్కీ ఓస్త్వాల్
ప్రశాంత్ సోలంకి
మందార్ భండారి
యోగేష్ డోంగరే
మరిన్ని వార్తలు చదవండి: KL రాహుల్ నేతృత్వంలో భారత్–దక్షిణాఫ్రికా ODIs: రోహిత్, విరాట్ జట్టులో, బుమ్రా రెస్ట్