T20 World Cup 2026 Controversy: Bangladesh Wants Matches Shifted from India to Sri Lanka

భారత్తో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 టీ20 ప్రపంచకప్లో భారత్లో జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ను కోరాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీబీకి ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అధికారికంగా వెల్లడించారు. ఐసీసీకి లేఖ రాసి, టోర్నమెంట్లో బంగ్లాదేశ్ మ్యాచ్లకు ప్రత్యామ్నాయ వేదికగా శ్రీలంకను ఎంపిక చేయాలని తాత్కాలిక ప్రభుత్వం బీసీబీకి సూచించిందని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
భారత్లో ఐపీఎల్ ఆడేందుకు ఒప్పందం ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమన్కు అనుమతి లభించని పరిస్థితుల్లో, జాతీయ జట్టు మొత్తంగా భారత్కు వెళ్లడం సురక్షితం కాదని ఆసిఫ్ నజ్రుల్ వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచకప్ మ్యాచ్లను భారత్లో నిర్వహించడం సమంజసం కాదని, అందుకే శ్రీలంకలో నిర్వహించాలని అధికారికంగా కోరాలని బీసీబీకి ఆదేశించినట్లు తెలిపారు.
అయితే ఈ డిమాండ్పై బీసీసీఐ స్పష్టంగా స్పందించింది. టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో వేదికల మార్పు సాధ్యం కాదని పేర్కొంది. ఒకే జట్టు అభ్యర్థన మేరకు వేదికలను మార్చడం సాధ్యంకాదని, ఇది ఇతర జట్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందని తెలిపింది.
ఇప్పటికే ఇతర జట్ల ప్రయాణ ఏర్పాట్లు, విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్స్ పూర్తయ్యాయని బీసీసీఐ వివరించింది. లీగ్ దశలో రోజుకు మూడు మ్యాచ్లు జరుగుతాయని, అందులో ఒక మ్యాచ్ ఇప్పటికే శ్రీలంకలోనే షెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది. అలాగే ప్రసార హక్కులు, బ్రాడ్కాస్టింగ్ ఏర్పాట్ల పరంగా కూడా వేదికల మార్పు పెద్ద సమస్యగా మారుతుందని పేర్కొంది. అందువల్ల మ్యాచ్లను తరలించడం బంగ్లాదేశ్ భావించినంత సులభం కాదని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే 2026 టీ20 ప్రపంచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం గ్రూప్ దశలో బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్లను భారత్లోనే ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7న ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో, ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్తో, ఫిబ్రవరి 17న ముంబై వాంఖడే స్టేడియంలో నేపాల్తో మ్యాచ్లు ఉన్నాయి.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, భారత్లో మ్యాచ్లు ఆడకూడదని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై ఐసీసీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్నివార్తలుచదవండి: విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ దుమ్మురేపుడు.. వరుసగా నాలుగు శతకాలు