IPL

T20 World Cup 2026 Controversy ICC Likely to Take Action Against Bangladesh

by Krishna R

టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి వద్ద విమర్శలకు గురవుతున్నాయి. భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమంటూ ఐసీసీ నిర్ణయాన్ని మార్చాలని కోరుతూ బంగ్లాదేశ్ ఐసీసీలోని వివాద పరిష్కార కమిటీని ఆశ్రయించింది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ కమిటీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయాలను మార్చే అధికారం లేకపోవడంతో బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తప్పదని తెలుస్తోంది.

2026లో భారత్ ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో భద్రతా కారణాలను చూపిస్తూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరియు క్రికెట్ బోర్డు భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని పట్టుబడుతున్నాయి. ఐసీసీ స్వతంత్ర భద్రతా సంస్థ ద్వారా సమగ్రంగా పరిశీలించి భారత్‌లో ప్రమాదం చాలా తక్కువేనని తేల్చినప్పటికీ బంగ్లాదేశ్ ఆ నివేదికను అంగీకరించడం లేదు.

ఈ అంశంపై ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పద్నాలుగు రెండు మెజారిటీతో మ్యాచ్‌లు భారత్‌లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ బీసీబీ ఇప్పుడు అంతర్గత వివాదాల పరిష్కార కమిటీని ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇక్కడే కీలక మలుపు ఉంది. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయాలపై ఈ కమిటీ విచారణ చేపట్టే అధికారం లేదు. అంటే బంగ్లాదేశ్ వేసిన అప్పీల్‌ను ఈ కమిటీ స్వీకరించే అవకాశమే లేదన్నమాట. అక్కడ కూడా ఫలితం లేకపోతే స్విట్జర్లాండ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించాలనే ఆలోచనలో బంగ్లాదేశ్ ఉన్నట్లు సమాచారం. అయితే సమయం వేగంగా గడుస్తుండటంతో ఐసీసీ కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ జై షా దుబాయ్‌లో ఉన్నారని, శనివారం లోపు బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టాండ్ బైలో ఉన్న స్కాట్లాండ్ జట్టు సాధన కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ వివాదం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది. భారత్ వ్యతిరేక వైఖరితో పేరొందిన బంగ్లాదేశ్ క్రీడల మంత్రి ఆసిఫ్ నజ్రుల్ ప్రభావంతోనే బీసీబీ ఈ విధంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ఐసీసీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి తమ నిర్ణయాన్ని ప్రకటించడంపై ఐసీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాకిస్థాన్ కూడా ఇదే తరహాలో బీసీసీఐపై పరిహారం కోరుతూ అప్పీల్ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే దారిలో సాగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ తన మొండితనాన్ని వీడకపోతే ప్రపంచకప్‌లో పాల్గొనే విలువైన అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి తొలగించడాన్ని కారణంగా చూపి భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడం బంగ్లాదేశ్ క్రికెట్‌కే నష్టం చేస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జై షా నేతృత్వంలోని ఐసీసీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్‌కు గట్టి షాక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

మరిన్నివార్తలుచదవండిInd vs NZ: 463 రోజుల నిరీక్షణకు ముగింపు.. సూర్యకుమార్ యాదవ్ మెరుపు హాఫ్ సెంచరీ