IPL

T20 World Cup 2026: Sri Lanka Appoints Vikram Rathour as Batting Coach

by Krishna R

టీ20 ప్రపంచ కప్ 2026కు సిద్ధమవుతున్న శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్‌ను నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్‌కు జట్టును పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలనే లక్ష్యంతో కన్సల్టెన్సీ ప్రాతిపదికన ఆయన సేవలను వినియోగించుకుంటున్నట్లు ఎస్‌ఎల్‌సీ వెల్లడించింది.

విక్రమ్ రాథోర్ జనవరి 18న శ్రీలంక జట్టుతో చేరనున్నారు. ప్రపంచ కప్ ముగిసే వరకు జట్టుతోనే కొనసాగనున్నారు. కోచింగ్ రంగంలో రాథోర్‌కు అపారమైన అనుభవం ఉంది. ఆయన 2019 సెప్టెంబర్ నుంచి 2024 జూలై వరకు భారత జాతీయ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా బీసీసీఐ లెవల్ 3 సర్టిఫైడ్ కోచ్‌గా కూడా గుర్తింపు పొందారు.

ప్రస్తుతం విక్రమ్ రాథోర్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు, శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రామకృష్ణన్ శ్రీధర్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. రాథోర్ భారత జట్టులో ఉన్న సమయంలో శ్రీధర్ కూడా ఫీల్డింగ్ కోచ్‌గా కలిసి పనిచేశారు. ఈ అనుభవం శ్రీలంక జట్టుకు మరింత ఉపయోగపడనుంది.

ప్రపంచ కప్ లక్ష్యంగా భారత కోచింగ్ అనుభవాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోంది. అంతేకాకుండా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవలందించనున్నారు.

ఈ టీ20 ప్రపంచ కప్‌కు భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. శ్రీలంక తమ లీగ్ మ్యాచ్‌లన్నింటినీ స్వదేశంలోనే ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

మరిన్నివార్తలుచదవండిENG vs NZ: మద్యం మత్తులో బౌన్సర్‌తో గొడవ.. ఇంగ్లండ్ కెప్టెన్‌కు భారీ శిక్ష