T20 World Cup: India vs Pakistan Match Gets Clearance After ICC Intervention

క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. టీ20 ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్పై ఉన్న అనిశ్చితి దాదాపుగా తొలగిపోయినట్టే కనిపిస్తోంది. మొదట ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడంతో పెద్ద చర్చ మొదలైంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఐసీసీ జోక్యంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ప్రతినిధులు ఇమ్రాన్ ఖవాజా, ముబషిర్ ఉస్మానీ లాహోర్లో పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీతో చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం కొన్ని షరతులపై భారత్తో మ్యాచ్ ఆడేందుకు పీసీబీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ను బహిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం భారత్తో ఈ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయ్యి ఉంటే ఐసీసీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాడ్కాస్టర్లకు భారీ నష్టాలు వాటిల్లేవి. అంతేకాకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉండేవి. చివరకు ఐసీసీ మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది.
ఇదిలా ఉండగా, టీ20 ప్రపంచకప్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు తలో మ్యాచ్ గెలుచుకున్నాయి. భారత్ యునైటెడ్ స్టేట్స్పై, పాకిస్తాన్ నెదర్లాండ్స్పై, వెస్టిండీస్ స్కాట్లాండ్పై, న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్పై విజయాలు సాధించాయి.
మరిన్నివార్తలుచదవండి: అభిషేక్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఆరోగ్యం పై అప్డేట్ టీ20 ప్రపంచకప్లో ఆడతాడా