Tamim Iqbal Sends Big Message on India Tour and Bangladesh Cricket Relations
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తమీమ్ ఇక్బాల్.. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలు త్వరలోనే మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2025 జూలైలో భారత్ బంగ్లాదేశ్ వైట్బాల్ పర్యటన వాయిదా పడిన తర్వాత రెండు బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మొదట 2025 ఆగస్టులో వన్డేలు, టీ20 మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. ఆ సిరీస్ను తర్వాత 2026 సెప్టెంబరుకు మార్చారు.
2026 జనవరిలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బంగ్లాదేశ్లో జరిగిన వివాదాస్పద ఘటనపై భారత్లో రాజకీయ ఒత్తిడి పెరగడంతో ముస్తాఫిజుర్ రహ్మాన్ను ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి తప్పించారు. దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్లో కొంతకాలం ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించారు. అనంతరం ఆ ఆంక్షలను ఎత్తివేశారు. ఇదే సమయంలో భారత్లో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి కూడా బీసీబీ తప్పుకుంది.
సెప్టెంబర్లో భారత్–బంగ్లాదేశ్ వైట్బాల్ సిరీస్ అవకాశాలు
ఒక దశలో ఇరు దేశాల క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయనే పరిస్థితి కనిపించింది. అయితే తరువాతి నెలల్లో పరిస్థితులు క్రమంగా చల్లబడ్డాయి. మార్చిలో వచ్చిన నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు జరిగే ఆరు మ్యాచ్ల వైట్బాల్ సిరీస్ కోసం భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు రావచ్చని బీసీబీ ఆశాభావంతో ఉంది. దీంతో రెండు బోర్డుల మధ్య చర్చలు మళ్లీ సానుకూల దిశగా సాగుతున్నట్లు స్పష్టమైంది.
గతంలో ఓ మాజీ బీసీబీ సభ్యుడు తమీమ్ను “భారత్ అనుకూల వ్యక్తి”గా విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఏప్రిల్లో బీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్తో ఉన్న వ్యక్తిగత స్నేహం ద్వారా ఇరు బోర్డుల మధ్య నమ్మకాన్ని తిరిగి తీసుకురాగలనని నమ్ముతున్నాడు. ఇద్దరి మధ్య ఆటగాళ్ల రోజుల నుంచే స్నేహం కొనసాగుతోందని తమీమ్ వెల్లడించాడు.
ది ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత బీసీబీ పాలకవర్గం టీ20 ప్రపంచకప్ అంశాన్ని సరిగా నిర్వహించలేదని తమీమ్ విమర్శించాడు. “గత పాలకవర్గం వ్యవహరించిన తీరు సరైంది కాదు. ఐసీసీ కొంత సడలింపు ఇచ్చింది. పరిష్కారం కనుగొనే అవకాశం ఉండేది. మనం దాన్ని ఉపయోగించుకోవాల్సింది” అని తెలిపాడు.
భారత్ ఆటగాళ్లకు బంగ్లాదేశ్ ఎప్పటికీ సురక్షిత వేదికేనని కూడా తమీమ్ స్పష్టం చేశాడు. “ప్రస్తుతం దేశ భద్రత అద్భుతంగా ఉంది. ఎలాంటి ముప్పు లేదు. భారత జట్టుకు ఎప్పుడూ భద్రత సమస్య రాలేదు” అని పేర్కొన్నాడు.
భారత్-బంగ్లాదేశ్ వైట్బాల్ సిరీస్ తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం.. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి రెండు వన్డేలు సెప్టెంబర్ 1, 3 తేదీల్లో మీర్పూర్లో నిర్వహించే అవకాశం ఉంది. మూడో వన్డే సెప్టెంబర్ 6న చట్టోగ్రామ్లో జరగనుంది. టీ20 సిరీస్ సెప్టెంబర్ 9న చట్టోగ్రామ్లో ప్రారంభమై.. చివరి రెండు మ్యాచ్లు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మీర్పూర్లో నిర్వహించే అవకాశముంది. ఈ పర్యటన విజయవంతంగా జరిగితే.. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు ఇది కీలక అడుగుగా మారనుంది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ మళ్లీ నంబర్వన్.. పాకిస్థాన్ను దాటేసిన దక్షిణాఫ్రికా