Team India Star Yashasvi Jaiswal Hospitalized After SMAT Match

టీమిండియా యువ ఓపెనర్, ముంబై స్టార్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అనారోగ్యానికి గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో భాగంగా మంగళవారం రాజస్థాన్తో జరిగిన సూపర్ లీగ్ మ్యాచ్ అనంతరం అతడికి తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది.
దీంతో జైశ్వాల్ను వెంటనే పుణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చేసిన పరీక్షల్లో అతడికి అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్, అంటే పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం జైశ్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే పూర్తిగా కోలుకునేందుకు కొన్ని రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు సమాచారం.
అనారోగ్యంతోనే మైదానంలోకి
రాజస్థాన్తో జరిగిన ఆ కీలక మ్యాచ్లో యశస్వి జైశ్వాల్ అస్వస్థతతో ఉన్నప్పటికీ ముంబై తరపున ఆడేందుకు మైదానంలోకి దిగడం గమనార్హం. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడు స్పష్టంగా అసౌకర్యానికి గురవుతున్నట్లు కనిపించాడు. ఓపెనర్గా ఇన్నింగ్స్ ప్రారంభించిన జైశ్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.
జైశ్వాల్ త్వరగా పెవిలియన్కు చేరుకున్నప్పటికీ ముంబై జట్టు మాత్రం అద్భుతంగా స్పందించింది. 217 పరుగుల భారీ లక్ష్యాన్ని మూడు వికెట్ల తేడాతో ఛేదించి ఘన విజయాన్ని సాధించింది. అజింక్య రహానె అజేయంగా 72 పరుగులు చేయగా, సర్ఫరాజ్ ఖాన్ 73 పరుగులతో అద్భుత హాఫ్ సెంచరీలు సాధించి జట్టును గెలిపించారు. అయితే ఈ విజయం సాధించినప్పటికీ నెట్ రన్రేట్ తక్కువగా ఉండటంతో ముంబై జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
టోర్నీ మొత్తంలో జైశ్వాల్ దూకుడు
ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యశస్వి జైశ్వాల్ తనదైన శైలిలో మెరిశాడు. మూడు మ్యాచ్ల్లో 48.33 సగటు, 168.6 స్ట్రైక్రేట్తో మొత్తం 145 పరుగులు చేసి టోర్నీలో ముంబైకి కీలక ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు కూడా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో జైశ్వాల్ అద్భుత శతకం బాది తన ఫామ్ను చాటుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ మైదానంలోకి దిగాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి: IPL 2026 మినీ వేలం: ముంబై ఇండియన్స్ తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు, క్వింటన్ డికాక్ హైటైట్లో