Team India’s Test Debacle: Gambhir Under Pressure, VVS Laxman Emerges as Top Contender

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ వరుసగా ఎదుర్కొన్న ఘోర పరాజయాలు భారత క్రికెట్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. స్వదేశంలోనే న్యూజిలాండ్ చేత 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా, ఇప్పుడు దక్షిణాఫ్రికా చేత 0-2తో మరోసారి ఓడిపోయింది. ఈ పరిణామాల కారణంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు పెరిగిపోతున్నాయి.
తాజా వైఫల్యాలు గంభీర్ స్థానం ప్రమాదంలో పడేసాయి. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ ఆయనను టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించే ఆలోచనలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో “తదుపరి కోచ్గా ఎవరే బెస్ట్?” అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
రేసులో వీవీఎస్ లక్ష్మణ్
గంభీర్ను తప్పిస్తే, అతని స్థానాన్ని భర్తీ చేయడానికి భారత మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ముందున్నారని సమాచారం. ప్రస్తుతం బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో హెడ్ ఆఫ్ క్రికెట్గా ఉన్న లక్ష్మణ్, గతంలో గంభీర్ జట్టుతో లేని సమయంలో తాత్కాలిక కోచ్గా కూడా పని చేశారు. టెస్ట్ జట్టుకు లక్ష్మణ్ను కోచ్గా నియమించాలన్న ప్రతిపాదనపై బోర్డు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గంభీర్ కోచింగ్లో టెస్ట్ ఫార్మ్ బాగా దెబ్బతిన్నదే
2024లో ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్, టెస్ట్ క్రికెట్లో ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయారు.
ఆయన కోచింగ్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 19 టెస్టులు ఆడగా,
7లో మాత్రమే విజయం,
10 మ్యాచ్ల్లో ఓటమి,
2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ గెలిచినప్పటికీ, టెస్ట్ ఫార్మాట్లో జట్టు ప్రదర్శన తీవ్రంగా పడిపోవడం గంభీర్పై చర్యలకు ప్రధాన కారణంగా మారింది.
త్వరలోనే ఈ అంశంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు సూచిస్తున్నాయి.
మరిన్ని వార్తలు చదవండి: IND vs SA 2nd Test: ఛీ.. ఇంత దారుణమా! 408 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు — 25 ఏళ్ల తర్వాత ఇదే ఘోర రికార్డు