TG20 Player Auction Highlights: Siraj, Tilak Varma and CV Milind Grab Big Deals
తెలంగాణ క్రికెట్ చరిత్రలో ఆదివారం ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రిన్సెస్ కన్వెన్షన్ సెంటర్లో తొలి టీజీ20 ప్లేయర్ వేలం ఘనంగా నిర్వహించారు. తెలంగాణకు చెందిన ఫ్రాంచైజీ ఆధారిత టీ20 లీగ్లో ఇది కీలక ఘట్టంగా నిలిచింది. హెచ్సీఏలో నమోదైన 1,300 మందికి పైగా క్రికెటర్లు ఎంపిక కోసం అందుబాటులో ఉండగా, ఫ్రాంచైజీలు తమ జట్ల నిర్మాణాన్ని ప్రారంభించాయి.
ఐకాన్ విభాగంలో అత్యధిక పోటీ నెలకొంది. భారత యువ స్టార్ తిలక్ వర్మను మెదక్ ఫాల్కన్స్ రూ.33 లక్షలకు దక్కించుకోవడంతో ఆయన వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ను వరంగల్ వారియర్స్ రూ.14 లక్షలకు సొంతం చేసుకుంది. క్యాప్ లేని ఆటగాళ్లలో సీవీ మిలింద్ అత్యధిక ధర పలికాడు. అతడిని అన్విత ఖమ్మం ఏసెస్ రూ.17 లక్షలకు ఎంపిక చేసుకుంది.
బంగ్లాదేశ్ సిరీస్ పరాజయం తర్వాత పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు.. షాన్ మసూద్కు షాక్?
రవికిరణ్, టీ. రవితేజ, తనయ్ త్యాగరాజన్, రాహుల్ బుద్ధి, తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు వంటి పలువురు ప్రముఖ క్రికెటర్లు కూడా వివిధ ఫ్రాంచైజీలకు చేరారు. దీంతో లీగ్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏ ప్లస్, ఏ విభాగాల్లో స్టార్ ఆటగాళ్లకు భారీ డిమాండ్
ఏ ప్లస్, ఏ విభాగాల్లో కూడా జట్లు తమ ప్రధాన బలగాలను పటిష్టం చేసుకునేందుకు గట్టి పోటీ పడ్డాయి. అమన్ రావు, ప్రగ్యాన రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, నితిన్ సాయి యాదవ్, ఆరోన్ జార్జ్, రక్షన్ రెడ్డి వంటి ఆటగాళ్లు ఏ ప్లస్ విభాగంలో ఆకర్షణగా నిలిచారు. ఏ విభాగంలో అర్ఫాజ్ అహ్మద్, అభిరత్ రెడ్డి చెరో రూ.11 లక్షలతో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాళ్లుగా నిలిచారు. చందన్ సహానీ, ప్రణవ్ వర్మ, హిమ తేజ కూడా మంచి డిమాండ్ను సొంతం చేసుకున్నారు.
బీ, సీ విభాగాల్లో తెలంగాణ గ్రామీణ స్థాయి ప్రతిభకు పెద్దపీట వేశారు. సాయి వికాస్ రెడ్డి, భావేష్ సేథ్, ఆశిష్ శ్రీవాస్తవ్ వంటి ఆటగాళ్లు బీ విభాగంలో ఎంపిక కాగా, గౌరవ్ రెడ్డి, ప్రతీక్ పవార్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి సీ విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువ క్రికెటర్లు, జిల్లా స్థాయి ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలన్న టీజీ20 లక్ష్యం ఈ వేలంలో స్పష్టంగా కనిపించింది.
ఈ వేలానికి ఫ్రాంచైజీ యజమానులు, జట్టు ప్రతినిధులు, మాజీ క్రికెటర్లు, హెచ్సీఏ అధికారులు సహా 300 మందికి పైగా హాజరయ్యారు. మొత్తం 160 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా, అందులో 9 మంది ఐకాన్ ఆటగాళ్లు, 6 మంది ఏ ప్లస్ ఆటగాళ్లు, 30 మంది ఏ విభాగం ఆటగాళ్లు, 8 మంది బీ విభాగం ఆటగాళ్లు, 107 మంది సీ మరియు సీ2 విభాగాల క్రికెటర్లు ఉన్నారు.
శుభ్మన్ గిల్కు కీలక సూచన.. డబ్ల్యూటీసీ, 2027 వరల్డ్ కప్పైనే పూర్తి ఫోకస్
వేలంలో ఫ్రాంచైజీలు కలిపి రూ.4.74 కోట్లు ఖర్చు చేశాయి. అనురాగ్ నల్గొండ నైట్స్ రూ.60 లక్షలతో అత్యధిక వ్యయం చేసిన జట్టుగా నిలిచింది. ప్రణవ రంగారెడ్డి రైజర్స్ రూ.59.95 లక్షలు, పాలమూరు స్ట్రైకర్స్ రూ.59.85 లక్షలు, మెదక్ ఫాల్కన్స్ రూ.59.20 లక్షలు వెచ్చించాయి.
ఈ సందర్భంగా టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ వి. అగం రావు మాట్లాడుతూ, తెలంగాణ క్రికెటర్లకు పెద్ద వేదికను అందిస్తూ వారి కలలకు కొత్త దారులు చూపే లక్ష్యంతో ఈ లీగ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి టీజీ20 సీజన్ 2026 జూన్ 21న ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో ప్రారంభం కానుంది. ఎనిమిది ఫ్రాంచైజీలు పాల్గొనే ఈ టోర్నమెంట్లో 21 రోజుల పాటు 32 మ్యాచ్లు నిర్వహించనున్నారు.