The Hundred 2026 Auction: Uncertainty Looms Over Pakistan Cricketers Amid IPL Influence
ది హండ్రెడ్ 2026 వేలం నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెటర్ల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. తాజా ఫ్రాంచైజీ అమ్మకాల తర్వాత టోర్నీలో కనీసం నాలుగు జట్లు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ఎంఐ లండన్, సదర్న్ బ్రేవ్, సన్రైజర్స్ లీడ్స్ ఐపీఎల్ యజమానులతో అనుబంధం కలిగి ఉన్నాయి. ఐపీఎల్ ఎకోసిస్టమ్లో పాక్ ఆటగాళ్లు 2008 తర్వాత కనిపించకపోవడంతో, ఈ వేలంలోనూ వారికి బిడ్లు పడే అవకాశాలు తగ్గినట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ది హండ్రెడ్ 2026 వేలం లండన్లో మార్చి 11న మహిళల విభాగం, మార్చి 12న పురుషుల విభాగం కోసం జరగనుంది. మొత్తం 18 దేశాల నుంచి దాదాపు వెయ్యిమంది ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులో పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే ఐపీఎల్ అనుబంధం ఉన్న నాలుగు ఫ్రాంచైజీలు పాక్ ప్లేయర్లపై బిడ్ వేయకపోవచ్చన్న నివేదికలు వారి అవకాశాలను మరింత క్షీణింపజేశాయి.
ఈ పరిస్థితికి మూలం భారత్–పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలే. 2008 తర్వాత పాక్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడలేదు. ఐపీఎల్ యజమానులు ఇప్పుడు ఇతర లీగ్లైన ఎస్ఏ20, ఐఎల్టీ20 వంటి టోర్నీల్లో పెట్టుబడులు పెడుతుండగా, అదే ధోరణి అక్కడ కూడా కనిపిస్తోంది. యూఏఈలో జరిగే ఐఎల్టీ20లో అమెరికన్ యాజమాన్యంలోని డెజర్ట్ వైపర్స్ మాత్రమే పాక్ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న ఉదాహరణ ఉంది.
ఈసీబీ సీనియర్ అధికారి అనధికారిక సంకేతాల ఆరోపణలు
బీబీసీ నివేదిక ప్రకారం, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు చెందిన ఓ సీనియర్ అధికారి అనధికారికంగా ఒక ప్లేయర్ ఏజెంట్కు, ఐపీఎల్ అనుబంధ జట్లు పాక్ ఆటగాళ్లను టార్గెట్ చేయవని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అధికారిక విధానం ఏదీ ప్రకటించకపోయినా, లీగ్ల మధ్య యాజమాన్య సంబంధాల ప్రభావంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో ఈసీబీ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్, ఐపీఎల్ పెట్టుబడులు వచ్చినా ద హండ్రెడ్లో ఏ దేశానికి చెందిన ప్లేయర్లపై వివక్ష ఉండదని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ క్రికెట్ కఠిన వివక్ష వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఆ హామీకి భిన్నంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
గత సీజన్లలో మహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీమ్ వంటి పాక్ స్టార్లు ద హండ్రెడ్లో ఆడారు. షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్ వంటి పేర్లు కూడా ఈ టోర్నీలో పాల్గొన్నారు. అయితే మహిళల విభాగంలో ఇప్పటివరకు ఒక్క పాకిస్థాన్ ప్లేయర్ కూడా ఆడలేదు.
2026 సీజన్లో ఈ ధోరణి కొనసాగుతుందా లేదా అనేది, ఫ్రాంచైజీలు తమ యాజమాన్య సంబంధాలు మరియు క్రికెట్ రాజకీయాల మధ్య ఎలా సమతుల్యం పాటిస్తాయన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అయితే పాక్ క్రికెటర్లకు వేలం ముందు పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు.
ఐసీసీ ప్రకటన: 2028 టీ20 వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించిన జట్లు ఇవే