IPL

U19 Asia Cup 2025: ICC Steps In Ahead of India vs Pakistan Clash Amid Handshake Controversy

by IPL Web Desk

U19 Asia Cup 2025: ICC Steps In Ahead of India vs Pakistan Clash Amid Handshake Controversyభారత్–పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎప్పటిలాగే భారీ హైప్ ఉంటుంది. కానీ ఈసారి ACC పురుషుల అండర్-19 ఆసియా కప్ 2025లో డిసెంబరు 14న దుబాయ్‌లో జరగబోయే పోరు మ్యాచ్ మొదలయ్యే ముందే రాజకీయ రంగు పులుముకుంది. మ్యాచ్ అనంతరం రెండు జట్లు చేతులు కలిపి, రాజకీయాలు పక్కన పెట్టి కనీసం క్రీడాస్ఫూర్తిని కాపాడాలని ICC ప్రత్యేకంగా సూచించడం చర్చనీయాంశమైంది. అయూష్ మ్హాత్రే నేతృత్వంలోని భారత అండర్-19 జట్టు, ఓపెనర్ వైభవ్ సూర్యవంషితో కలిసి పాకిస్థాన్‌ను ఎదుర్కోనుండటంతో ఈ పోరు సహజంగానే భారీ దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ వివాదానికి మూలం ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్ 2025. భారత్–పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల్లోనూ BCCI ఆటగాళ్లకు ప్రత్యర్థులతో చేతులు కలపవద్దని సూచించింది. మేలో పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో స్పష్టం చేసింది. ఆ సమయంలో ఈ “హ్యాండ్‌షేక్ వివాదం” క్రికెట్ కంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

మరోసారి వివాదం కాకుండా ముందుగానే చర్యలు తీసుకున్న ICC

ఇలా మరోసారి వివాదం రాకుండా ముందుగానే చర్యలు తీసుకుంటూ ICC ఈసారి జాగ్రత్తపడుతోంది. PTI సమాచారం ప్రకారం, జూనియర్ క్రికెట్‌లో రాజకీయ సంకేతాలు వ్యక్తం కాకూడదని భావించిన ICC, BCCIకి స్పష్టమైన సూచనలు ఇచ్చింది. భారత జట్టు మేనేజర్ ఆనంద్ డాటర్‌కు ఈ మార్గదర్శకాలు చేరినట్టు తెలుస్తోంది. అయితే భారత జట్టు చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇంకా స్పష్టత లేదు. చేతులు కలపకూడదనుకుంటే ముందే మ్యాచ్ రెఫరీకి తెలియజేయాలని ICC చెబుతోంది—అయితే ఆ పరిస్థితే రాకపోవాలని కోరుకుంటోంది.

ఇలా జరగడం కొత్తేమీ కాదు. మహిళల ODI వరల్డ్ కప్ 2025లో, ACC ఎమర్జింగ్ ఆసియా కప్‌లో కూడా ఇదే నిర్ణయాన్ని భారత్ కొనసాగించింది. ప్రతి మ్యాచ్‌కు ముందు మ్యాచ్ రెఫరీలకు సమాచారం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వరుసగా వివాదం పెద్దదవుతూ రావడంతో, ఆచారాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని ICC ఈసారి ప్రయత్నిస్తోంది.

ఇప్పటికీ చివరి మాట మాత్రం BCCIదే. భారత్ అండర్-19 జట్టు మేనేజర్ ఆనంద్ డాటర్, హెడ్ కోచ్ హృషీకేశ్ కనిట్కర్ డిసెంబరు 14 మ్యాచ్‌కు ముందు జట్టు వైఖరిని ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి ఆటగాళ్లకు దీనిపై ఎలాంటి ప్రత్యేక సూచనలు ఇవ్వలేదని తెలుస్తోంది. అందుకే పరిస్థితి ఏ దిశలో మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం.

క్రికెట్ విషయానికి వస్తే—అండర్-19 ఆసియా కప్ డిసెంబరు 12 నుంచి ప్రారంభం. భారత్ గ్రూప్ Aలో పాకిస్థాన్, UAE, మలేషియాలతో ఉంది. మరో వైపు గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ టీమ్‌లు ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ పోటీ తీవ్రంగానే ఉంటుందని అంచనా.

ఈసారి దృష్టి నిజంగా క్రికెట్‌పైనే నిలుస్తుందా? లేక “హ్యాండ్‌షేక్” చర్చ మళ్లీ వెలుగులోకి వస్తుందా? ఇప్పటికీ చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, భారత్ vs పాకిస్థాన్ పోరు అంటే ఎప్పుడూ మైదానాని దాటి మరిన్ని కథలకూ తెరలేవుతుంది.

మరిన్ని వార్తలు చదవండి: IPL 2026: మొత్తం 10 జట్లు అధికారిక రిటెన్షన్ మరియు రిలీజ్ లిస్ట్ & పర్స్ వివరాలు