U19 World Cup 2026 India Beat Zimbabwe by 204 Runs Vihaan Malhotra Century

అండర్ 19 ప్రపంచకప్లో యువ భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ సిక్స్కు అర్హత సాధించిన యంగ్ ఇండియా, ఈ దశలోనూ తొలి మ్యాచ్లోనే ఘన విజయం నమోదు చేసింది.
బులవాయో వేదికగా జనవరి 27న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 204 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, విహాన్ మల్హోత్రా అజేయ శతకం సహాయంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 30 బంతుల్లో 52 పరుగులు చేసి ఇన్నింగ్స్కు వేగం అందించాడు. అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మిడిలార్డర్ బ్యాటర్ మరియు వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు 62 బంతుల్లో 61 పరుగులు చేసి విహాన్కు చక్కటి సహకారం అందించాడు.
చివరి ఓవర్లలో ఖిలన్ పటేల్ కేవలం 12 బంతుల్లో 30 పరుగులు చేసి స్కోర్ను మరింత పెంచాడు. అతని ఇన్నింగ్స్లో ఒక ఫోర్ మరియు మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇతర ఆటగాళ్లలో ఆరోన్ జార్జ్ 23, కెప్టెన్ ఆయుష్ మాత్రే 21, వేదాంత్ త్రివేది 15, కనిష్క్ చౌహాన్ 3, అంబ్రిష్ 21, హెనిల్ పటేల్ అజేయంగా 2 పరుగులు చేశారు.
జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో మూడు వికెట్లు పడగొట్టగా, పనాషే మజాయ్ మరియు కెప్టెన్ సింబరాషే మడ్జెంగెరె చెరో రెండు వికెట్లు తీశారు. ధృవ్ పటేల్ ఒక వికెట్ సాధించాడు.
352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన జింబాబ్వే జట్టు భారత బౌలర్ల దాటికి పూర్తిగా కుప్పకూలింది. 37 పాయింట్ 4 ఓవర్లలో కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయింది. లీరాయ్ 62, కియాన్ బ్లిగ్నాట్ 37, టటెండ చిముగోరో 29 పరుగులు చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
భారత బౌలర్లలో ఉధవ్ మోహన్ మరియు ఆయుష్ మాత్రే చెరో మూడు వికెట్లు పడగొట్టగా, అంబ్రిష్ రెండు వికెట్లు సాధించాడు. హెనిల్ పటేల్ మరియు ఖిలన్ పటేల్ చెరో ఒక వికెట్ తీశారు.
సూపర్ సిక్స్ దశలో భారత్ తదుపరి మ్యాచ్ దాయాది పాకిస్తాన్తో జరగనుంది. ఈ కీలక పోరు ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా నిర్వహించనున్నారు.
మరిన్నివార్తలుచదవండి: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ భారత్ మ్యాచ్ల పూర్తి వివరాలు