Vaibhav Suryavanshi Becomes Most Searched Indian Cricketer in 2025, Surpasses Dhoni, Kohli & Rohit

టీమిండియా లెజెండ్స్ అయిన ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, అతడి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్లో అతని ఆటను చూడడానికి అభిమానులు ఇప్పటికీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.
అదే విధంగా రోహిత్–కోహ్లి ద్వయం కూడా ప్రస్తుతం ప్రధానంగా వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నప్పటికీ, వీరిని ప్రేమించి, ఆదరించే ఫ్యాన్స్ సంఖ్య తగ్గలేదు. అయితే, 2025 సంవత్సరంలో ఈ ముగ్గురు స్టార్లను ఓ యువ క్రికెటర్ ఆశ్చర్యకరంగా అధిగమించాడు.
అతడెవరో తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో విపరీతంగా సెర్చ్ చేశారు. అతడే భారత అండర్–19 సంచలనం, భవిష్యత్ స్టార్ వైభవ్ సూర్యవంశీ.
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది గూగుల్లో భారత్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన వ్యక్తిగా నిలిచాడు. ఐపీఎల్, ఇండియా 'ఏ' మ్యాచ్లు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి టోర్నీల్లో అతడు చేసిన సంచలన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా అతడిపై భారీ ఆసక్తిని రేకెత్తించాయి. వైభవ్ కేవలం 12 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసి వరల్డ్ రికార్డు కూడా సృష్టించాడు.
గూగుల్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2025’ నివేదిక ప్రకారం, వైభవ్ మొదటి స్థానంలో నిలవగా, పంజాబ్ కింగ్స్ యువ క్రికెటర్ ప్రియాన్ష్ ఆర్య రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తరువాత అభిషేక్ శర్మ, షేక్ రషీద్ స్థానం దక్కించుకున్నారు. అలాగే మహిళల ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ గురించే కూడా పెద్ద సంఖ్యలో సెర్చ్లు నమోదయ్యాయి.
మరిన్ని వార్తలు చదవండి: IPL 2026 Auction: కేవలం 4 మ్యాచ్లు ఆడినా… ఆ ప్లేయర్పై ₹10 కోట్లు పెట్టేందుకు కేకేఆర్ సిద్ధం!