IPL

Vijay Hazare Trophy: Dhruv Jurel Stuns with Match-Winning Century

by Krishna R

న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరో నాలుగు రోజుల్లో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపికపై ఆసక్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో భారత యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన అద్భుత ప్రదర్శనతో సెలక్టర్లకు గట్టి సందేశం పంపించాడు.

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధ్రువ్ జురెల్, రాజ్‌కోట్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో మెరిశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జురెల్, టీ20 తరహాలో దూకుడుగా ఆడి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా తన ఆటతీరులో ఏమాత్రం తగ్గుదల చూపలేదు.

యూపీ కెప్టెన్ రింకూ సింగ్‌తో కలిసి జురెల్ పరుగుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 78 బంతుల్లోనే తన తొలి లిస్ట్-ఏ సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొన్న జురెల్ 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 160 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు రింకూ సింగ్ 67 బంతుల్లో 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ జోడి అద్భుత ఆటతీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీగా 369 పరుగులు చేసింది. బరోడా బౌలర్లలో యువ పేసర్ రాజ్ లింబానీ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ఇదిలా ఉండగా, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో రెండో వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఎవరు ఎంపిక అవుతారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేఎల్ రాహుల్ ప్రధాన వికెట్‌కీపర్‌గా ఖాయం కాగా, అతడికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ నెలకొంది. అయితే వన్డే జట్టు నుంచి రిషబ్ పంత్‌ను తప్పించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కిషన్‌-జురెల్‌లలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. గత కొన్ని సిరీస్‌లకు ధ్రువ్ జురెల్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, ఇంకా అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేయలేదు. మరోవైపు ఇషాన్ కిషన్ ఈ దేశవాళీ వన్డే టోర్నీ తొలి మ్యాచ్‌లోనే శతకంతో సత్తా చాటాడు.

ఇక సెలక్టర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. న్యూజిలాండ్ సిరీస్ కోసం జట్టు ఎంపికపై ఆసక్తి రోజురోజుకూ మరింత పెరుగుతోంది.

మరిన్ని వార్తలు చదవండి:శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీకి గండం? వన్డే సారథిగా రోహిత్ శర్మ తిరిగి వస్తాడా?