Virat Kohli Refuses to Play Vijay Hazare Trophy, Poses Problem for BCCI – Reports
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు పైన జరుగుతున్న చర్చ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. డ్రెస్సింగ్ రూమ్ లోపల కూడా కొంత అసంతృప్తి పెరుగుతోందని, ఇది విషయాన్ని మరింత క్లిష్టంగా మార్చేసింది.
ఎన్డీటీవీ వర్గాలు చెబుతున్న మాట ప్రకారం... కోహ్లీతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య సంబంధాలు కొంచెం చల్లబడుతున్నాయట. కోహ్లీ బ్యాటింగ్ ప్లాన్, ప్రిపరేషన్ ఎలా ఉండాలి అన్న గట్టి విషయాల్లో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ ఒక్క ఘటన కూడా జట్టు లోపల డైనమిక్స్, సీనియర్ ఆటగాళ్ల అందుబాటు ఎలా నిర్వహిస్తున్నారు అన్న లోతైన సమస్యల్ని బయటపెట్టింది.
అయితే రోహిత్ శర్మ మాత్రం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి విజయ్ హజారే ట్రోఫీకి తాను ఆడతానని స్పష్టంగా చెప్పేశాడు. ఈ సీనియర్ ఓపెనర్ సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ ఆడబోతున్నాడు. రాబోయే ముఖ్యమైన అంతర్జాతీయ మ్యాచుల కోసం తన ఫామ్ని కాపాడుకోవాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్కి ఇలా ముందుకు రావడం రోహిత్ ఎంత సీరియస్గా ఉన్నాడో చూపిస్తోంది.
సీనియర్ ఆటగాళ్లకు మినహాయింపు ఇవ్వడంలో న్యాయ సమస్యలు
కానీ విరాట్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీ ఆడటానికి ఇష్టం లేనట్టు చెప్పేశాడట. “అతిగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు” అని ఆయన భావన. ఈ వైఖరి వల్ల బీసీసీఐ కొంచెం ఇబ్బంది పడుతోంది. కోహ్లీ స్థాయి ఆటగాడికి మినహాయింపు ఇస్తే... మిగతా వాళ్లకి ఏం సమాధానం చెప్పాలి? న్యాయం ఎక్కడికి పోతుంది అన్న ప్రశ్నలు వస్తాయని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. “సమస్య విజయ్ హజారే ట్రోఫీతోనే. ఆయనకి ఆడాలనిపించడం లేదు. రోహిత్ ఆడుతుంటే ఒక్కడికే ఎలా మినహాయింపు ఇస్తాం? మిగతా ఆటగాళ్లతో ఏం మాట్లాడతాం?” అంటూ ఒక సీనియర్ అధికారి బాధపడ్డాడట.
సెలక్షన్ కమిటీ, గంభీర్ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో ఆడాలని గట్టిగా చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఓడిపోయాక ఇద్దరినీ రంజీలో ఆడించిన తీరు దానికి నిదర్శనం. మ్యాచ్ ప్రాక్టీస్, ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో బోర్డు మళ్లీ మళ్లీ నొక్కి చెబుతోంది.
రాంచీలో దక్షిణాఫ్రికాతో తొలి వన్డే అనంతరం కోహ్లీ ఇలా అన్నాడు – “నేను ఎప్పుడూ ఎక్కువ ప్రిపరేషన్లో నమ్మకం ఉంచలేదు. నా క్రికెట్ అంతా మెంటల్గానే సాగింది. ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటే చాలు, బ్యాటింగ్ విజువలైజ్ చేసుకుంటూ మనసు సిద్ధం చేసుకుంటే సరిపోతుంది.” ఈ మాటలు ఆయనకీ, జట్టు నిర్వాహకులకూ మధ్య ఆలోచనా తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో బీసీసీఐ త్వరగా చర్య తీసుకుంది. జాతీయ సెలక్టర్ ప్రగ్యాన్ ఓఝాని రాయ్పూర్కి పంపారు. బుధవారం రెండో వన్డే జరగబోయే చోటికి వెళ్లి కోహ్లీ-గంభీర్ మధ్య మధ్యవర్తిత్వం చేయమని ఆదేశించారు. రాబోయే ముఖ్యమైన టోర్నీల ముందు ఆటగాడు-నిర్వాహకుల సంబంధాలు సజావుగా ఉండేలా చూడాలన్నదే బోర్డు ఆలోచన.
ఏమవుతుందో చూడాలి... కానీ ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో కొంచెం టెన్షన్ మినహా ఏమీ కనిపించడం లేదు.