IPL

Washington Sundar Ruled Out of NZ T20 Series, World Cup in Doubt

by Krishna R

త్వరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డే సందర్భంగా గాయపడిన కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, టీ20 సిరీస్ మొత్తం నుంచి తప్పుకున్నాడు. అంతేకాదు, అతడి గాయం తీవ్రతను బట్టి చూస్తే రాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో కూడా అతని పాల్గొనడం అనుమానంగా మారింది.

న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కి, టీ20 వరల్డ్‌కప్‌కి ఒకే జట్టును సెలెక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుందర్ గాయం టీమిండియా ప్రణాళికలపై పెద్ద ప్రభావమే చూపిస్తోంది.

సుందర్‌కు అసలు ఏమైంది?

జనవరి 11న వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా వాషింగ్టన్ సుందర్‌కు ఎడమ వైపు పక్కటెముకల ప్రాంతంలో తీవ్ర నొప్పి మొదలైంది. వెంటనే అతను మైదానాన్ని విడిచిపెట్టాడు. అయితే, లక్ష్య ఛేదన సమయంలో అతని బ్యాటింగ్ సేవలు జట్టుకు అవసరమవడంతో రిస్క్ తీసుకుని మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు.

ఈ ప్రయత్నమే గాయాన్ని మరింత పెంచిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఆ మ్యాచ్‌లో సుందర్ 7 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత అతడు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆటగాడు ఆయుశ్ బదోనిని జట్టులోకి తీసుకున్నారు.

గాయం పూర్తిగా మానకపోవడంతో తాజాగా సుందర్‌ను టీ20 సిరీస్ నుంచీ కూడా తప్పించారు. టీ20లకు అతడి ప్రత్యామ్నాయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, సుందర్ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడటం కూడా సందేహమేనని తెలుస్తోంది.

పొట్టి ఫార్మాట్‌లో సుందర్ లాంటి మిడిల్ ఆర్డర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడం టీమిండియా విజయావకాశాలపై తప్పకుండా ప్రభావం చూపించనుంది. ఇటీవల కాలంలో సుందర్ టీ20ల్లో నమ్మదగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. పవర్‌ప్లే నుంచి డెత్ ఓవర్ల వరకూ అవసరమైన సమయంలో బౌలింగ్ చేయగలడు. అంతేకాదు 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ కీలక పరుగులు సాధించే సామర్థ్యం కూడా అతడికి ఉంది.

రియాన్ పరాగ్‌కు అవకాశం దక్కుతుందా?

సుందర్ స్థానంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు రియాన్ పరాగ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో పరాగ్ ఓ మోస్తరు కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆ టోర్నీలో 32.75 సగటుతో 393 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

ఒకవేళ పరాగ్‌కు ఈ సిరీస్‌లో అవకాశం లభించి, అతడు మెరుగ్గా రాణిస్తే.. టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఉపఖండంలోని పిచ్‌లపై స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎంతో కీలకంగా మారుతారు.

అదే సమయంలో వన్డే సిరీస్‌లో సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆయుశ్ బదోనినే టీ20 సిరీస్‌కు కూడా కొనసాగించే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.