Why Did Virat Kohli Arrive in Mumbai? To Meet Messi or to Play Vijay Hazare Trophy?

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కొద్ది రోజులు కుటుంబంతో గడపడానికి యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 13న ఆయన తన భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కోహ్లీ తిరిగి భారత్కు వచ్చిన సమయంపై అభిమానుల్లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
మెస్సీని కలవడానికే వచ్చారా అనే చర్చలు కూడా తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 14 ఏళ్ల తర్వాత మూడు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చారు. డిసెంబర్ 13 తెల్లవారుజామున రెండు గంటలకు కోల్కతాకు చేరుకున్న మెస్సీ, సాల్ట్ లేక్ స్టేడియాన్ని సందర్శించారు.
అక్కడ లక్షలాది మంది అభిమానుల మధ్య సుమారు ఇరవై నిమిషాలు గడిపిన అనంతరం, ఆయన మధ్యాహ్నం కోల్కతా నుంచి హైదరాబాద్కు ప్రయాణించారు. మెస్సీ భారత్లో ఉన్న సమయానికే కోహ్లీ ముంబై చేరుకోవడంతో, ఆయనను కలవడానికే కోహ్లీ తిరిగి వచ్చారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే ఈ ఊహాగానాలకు తెరపడింది. కోహ్లీ మెస్సీని కలవడానికి భారత్కు రాలేదని స్పష్టమైంది. రాబోయే విజయ్ హజారే ట్రోఫీ 2025 26 కోసం సన్నాహాలు ప్రారంభించడానికే ఆయన తిరిగి దేశానికి వచ్చారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించిన సమాచారం ప్రకారం, కోహ్లీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లలో పాల్గొననున్నారు.
జాతీయ జట్టు తరఫున మ్యాచ్లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్లో ఆడటం తప్పనిసరి అనే నిబంధనను బీసీసీఐ అమలు చేస్తోంది. ఈ నిబంధన ప్రకారమే కోహ్లీ కూడా ఢిల్లీ జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాల్సి ఉంది. ఈ దేశవాళీ మ్యాచ్లు పూర్తయిన తర్వాతే, వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్కు ఆయన అందుబాటులోకి రానున్నారు.
Virat Kohli and Anushka Sharma snapped at the Private Airport, Mumbai🥹🫶🏻 pic.twitter.com/X0nxSJOVFr
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) December 13, 2025
కోహ్లీ ప్రస్తుత ఫామ్ అభిమానులకు మరింత ఉత్సాహం కలిగిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్లో అతడు అద్భుతంగా రాణించాడు. మూడు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో కలిపి మొత్తం 302 పరుగులు చేశాడు. సగటు వందకు పైగా ఉండడం అతని స్థిరత్వానికి నిదర్శనం.
అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రెండు సార్లు డక్గా ఔట్ కావడంతో కోహ్లీ ఫామ్పై కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ దక్షిణాఫ్రికా సిరీస్లో తన బ్యాట్తో ఘనంగా సమాధానం ఇచ్చిన కోహ్లీ, 2027 వన్డే ప్రపంచకప్లో తన స్థానం పక్కాగా ఉందని మరోసారి నిరూపించాడు.
మరిన్ని వార్తలు చదవండి: IND vs SA 2వ టీ20 ఓటమి తర్వాత గంభీర్, హార్దిక్ మధ్య ఉద్రిక్తత!