IPL

WPL 2026: Delhi Capitals Beat UP Warriorz, Qualify for Knockouts

by Krishna R

డబ్ల్యూపీఎల్‌ (విమెన్స్ ప్రీమియర్ లీగ్) 2026లో జరిగిన 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు యూపీ వారియర్జ్‌తో తలపడింది. ఫిబ్రవరి 1న వడోదరలోని కోటాంబి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ నిర్ణీత ఓవర్లలో 122 పరుగులకే పరిమితమైంది.

లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాంటి తడబాటు లేకుండా ఆడింది. 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మొత్తం ఎనిమిది పాయింట్లు చేరాయి. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ జట్టు, ఈ విజయంతో నాకౌట్ దశకు అర్హత సాధించింది.

ఇదే మ్యాచ్‌తో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన ముంబై, డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలిసారిగా గ్రూప్ దశలోనే నాకౌట్ అయ్యింది.

ఢిల్లీ విజయానికి వోల్వార్డ్, కాప్ కీలక పాత్ర
మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే, టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ ఆరంభంలోనే తడబడింది. కెప్టెన్ దీప్తి శర్మ 19 బంతుల్లో 24 పరుగులు చేసి కొంత పోరాడినా, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. సిమ్రాన్ షేక్ 14 బంతుల్లో 22 పరుగులు జోడించగా, శిఖా పాండే 13 బంతుల్లో 23 పరుగులతో అజేయంగా నిలిచింది. అయితే, ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన వల్ల యూపీ జట్టు పెద్ద స్కోర్ చేయలేకపోయింది.

ఢిల్లీ తరపున మారిజానే కాప్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టింది. శ్రీ చరణి, చినెల్ హెన్రీ రెండేసి వికెట్లు తీసుకోగా, మిన్ను మణి ఒక వికెట్ సాధించింది.

తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు లిజెల్ లీ, షఫాలి వర్మ ఓపెనింగ్ అందించారు. లిజెల్ లీ 10 పరుగులు చేయగా, షఫాలి వర్మ 29 పరుగులతో మంచి ఆరంభం ఇచ్చింది. ఆ తర్వాత లారా వోల్వార్డ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి 36 బంతుల్లో 47 పరుగులు చేసింది. ఆమెకు జెమిమా రోడ్రిగ్స్ అద్భుతంగా సహకరించింది. జెమిమా కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యాన్ని సులభంగా ఛేదించి ఐదు వికెట్లతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ జట్టు నాకౌట్ దశకు చేరుకోగా, టోర్నీ ఆసక్తికర మలుపు తిరిగింది.