WPL 2026: Gujarat Giants Beat UP Warriors in High-Scoring Thriller

మహిళల ప్రీమియర్ లీగ్–2026లో గుజరాత్ జెయింట్స్ జట్టు విజయంతో శుభారంభం చేసింది. శనివారం డివై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో గుజరాత్ 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్కు కెప్టెన్ యాష్లీ గార్డనర్ నాయకత్వం వహిస్తూ విధ్వంసకరంగా ఆడింది. ఆమె కేవలం 41 బంతుల్లోనే 65 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది.
ఈ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండగా, ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించింది. ఆమెకు తోడుగా అరంగేట్ర ఆటగాడు అనుష్క శర్మ 44 పరుగులతో ఆకట్టుకోగా, సీనియర్ ప్లేయర్ సోఫీ డివైన్ 38 పరుగులతో కీలక పాత్ర పోషించింది. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ 2 వికెట్లు పడగొట్టగా, శిఖా పాండే, డియాండ్రా డాటిన్ తలో వికెట్ సాధించారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన యూపీ వారియర్స్ చివరి వరకు పోరాడింది. ఒక దశలో గెలుపు దిశగా సాగుతున్నట్లు కనిపించినా, కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులకే పరిమితమైంది.
యూపీ ఇన్నింగ్స్లో యువ బ్యాటర్ ఫీబీ లిచ్ఫీల్డ్ మెరుపులు మెరిపించింది. ఆమె 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి మ్యాచ్కు ఊపునిచ్చింది. అయితే దూకుడుగా ఆడుతున్న లిచ్ఫీల్డ్ను సోఫీ డివైన్ బౌలింగ్లో ఔట్ చేయడంతో మ్యాచ్ దిశ మారిపోయింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 30 పరుగులు చేయగా, ఆశా శోభన 27 పరుగులతో పర్వాలేదనిపించారు. అయితే భారత స్టార్ ప్లేయర్లు హర్లీన్ డియోల్ (0), దీప్తీ శర్మ (1) తీవ్రంగా నిరాశపరిచారు.
గుజరాత్ బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్, సోఫీ డివైన్, జార్జియా తలా రెండు వికెట్లు తీసి యూపీ జట్టుపై ఒత్తిడి తెచ్చారు. గైక్వాడ్, యాష్లీ గార్డనర్ తలా ఒక వికెట్ సాధించారు. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్లో సమతూకంగా రాణించిన గుజరాత్ జెయింట్స్ ఈ విజయంతో టోర్నీలో బలమైన ఆరంభం చేసింది.
మరిన్ని వార్తలు చదవండి: విరాట్ కోహ్లీకి చరిత్రాత్మక రికార్డు అవకాశం న్యూజిలాండ్ సిరీస్లో