IPL

WPL 2026 Season Starts January 9: Caravan Model Across Navi Mumbai & Vadodara

by IPL Web Desk

WPL 2026 Season Starts January 9: Caravan Model Across Navi Mumbai & Vadodaraమహిళల ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ జనవరి 9న ప్రారంభమవనున్నట్లు లీగ్‌ చైర్మన్‌ జయేష్ జార్జ్ గురువారం ఢిల్లీలో జరిగిన మెగా వేలంపాట సందర్భంగా ప్రకటించారు. సాధారణంగా ఫిబ్రవరి–మార్చి నెలల్లో జరిగే ఈ టోర్నీ, ఈసారి పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ (ఫిబ్రవరి 7న ప్రారంభం) దృష్ట్యా ముందుకు తీసుకువచ్చారు. ఈ సీజన్‌ను నవి ముంబై, వడోదరా నగరాల్లో నిర్వహించనున్నారు. ఇది లీగ్ షెడ్యూల్‌, వేదికల్లో ఒక పెద్ద మార్పుగా నిలిచింది.

వేలంపాట ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ జయేష్ జార్జ్, ఈసారి కూడా లీగ్‌కు ‘కారవాన్ మోడల్‌’ కొనసాగుతుందని వెల్లడించారు. తొలి భాగం నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరగనుంది  అదే వేదికపై భారత్ ఇటీవల మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచింది. టోర్నీ చివరి దశలో వడోదరాకు మారుతోంది. ఫిబ్రవరి 5న అక్కడే ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గత సారి ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌కి టైటిల్ రక్షకురాలిగా అడుగుపెడుతోంది.

×
Deepti Sharma Allrounder

యూపీ వారియర్స్‌ RTM కార్డ్ వినియోగించి దీప్తిని రూ.3.20 కోట్లు తిరిగి పొందింది

వేలంపాటలో అత్యధిక ఉత్సాహం భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చుట్టూ కనిపించింది. వన్డే వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌’గా నిలిచిన ఆమెపై అన్ని జట్లు కన్నేశారు. రూ.50 లక్షల బేస్‌ప్రైస్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్డింగ్ ప్రారంభించగా, తరువాత యూపీ వారియర్స్‌ తమ రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ వినియోగించి దీప్తిని రూ.3.20 కోట్లు ఇచ్చి తిరిగి దక్కించుకున్నారు. గత ఒప్పందం (రూ.2.6 కోట్లు)తో పోలిస్తే ఇది పెద్ద పెరుగుదలనే చెప్పాలి.

మూడు సీజన్లలో 25 మ్యాచ్‌ల్లో దీప్తి సాధించిన 507 పరుగులు, 27 వికెట్లు ఆమె విలువను స్పష్టంగా చెబుతాయి. తన స్థిరమైన ప్రదర్శనలతో లీగ్‌లో అత్యంత విలువైన ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలిచిన ఆమెను కొనసాగించడం ద్వారా యూపీ వారియర్స్‌ తమ దళ బలం మరింత పెంచుకున్నారు.

ఇక ఇతర ప్రముఖ ఆటగాళ్ల సంతకాలూ వేలంపాట ఉత్సాహాన్ని పెంచాయి. గత సీజన్‌లో అత్యధిక వికెట్లను తీసిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమీలియా కేర్‌ను ముంబై ఇండియన్స్ రూ.3 కోట్లు ఇచ్చి సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ మేగ్ లానింగ్, న్యూజిలాండ్ స్టార్ సోఫీ డివైన్‌లు కూడా ప్రధాన ఆకర్షణలుగా నిలిచారు. గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లు ఇస్తూ డివైన్‌ను కొనుగోలు చేయగా, యూపీ వారియర్స్‌ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ పడి లానింగ్‌ను రూ.1.90 కోట్లకే తమ జట్టులో చేర్చుకుంది.