IPL

WPL 2026: UP Warriorz Appoint Meg Lanning as New Captain

by Krishna R

మహిళల ఐపీఎల్ 2026 (డబ్ల్యూపీఎల్) ప్రారంభానికి ముందే యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మెగ్ లాన్నింగ్‌ను నియమించింది. ఈ విషయాన్ని వారియర్జ్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

33 ఏళ్ల మెగ్ లాన్నింగ్‌ను ఈ సీజన్ వేలంలో యూపీ వారియర్జ్ రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. లాన్నింగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో, గత సీజన్ వరకు జట్టును నడిపించిన దీప్తి శర్మపై కెప్టెన్సీ నుంచి వేటు పడింది. అయితే దీప్తి శర్మ రానున్న సీజన్‌లో సాధారణ ప్లేయర్‌గా జట్టులో కొనసాగనుంది. ఆసక్తికరంగా, దీప్తిని వారియర్జ్ యాజమాన్యం ఈ వేలంలో రూ. 3.2 కోట్ల భారీ మొత్తంతో తిరిగి సొంతం చేసుకుంది.

మెగ్ లాన్నింగ్‌కు కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆమె నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు ఒక వన్డే ప్రపంచకప్‌తో పాటు నాలుగు టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. డబ్ల్యూపీఎల్‌లో కూడా లాన్నింగ్ కెప్టెన్సీకి మంచి పేరు ఉంది. ఆమె సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు సీజన్లలో ఫైనల్‌కు చేరింది. అయితే ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆమెను విడుదల చేసింది.

లాన్నింగ్ నాయకత్వంలో యూపీ వారియర్జ్ జట్టు పరిస్థితి మారుతుందా అనే ఆసక్తి ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇప్పటివరకు డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత నిరాశాజనకమైన రికార్డు ఈ ఫ్రాంచైజీదే. తొలి ఎడిషన్ 2023లో మూడో స్థానంలో నిలిచిన ఈ జట్టు, ఆ తర్వాత క్రమంగా దిగజారుతూ 2024లో నాలుగో స్థానం, 2025లో చివరి స్థానం అయిన ఐదో స్థానానికి పడిపోయింది.

ఇదిలా ఉండగా, డబ్ల్యూపీఎల్ 2026 జనవరి 9 నుంచి ప్రారంభం కానుంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. యూపీ వారియర్జ్ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 10న గుజరాత్ జెయింట్స్‌తో ఆడనుంది.

మరిన్నివార్తలుచదవండిటీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌లో ఆడబోమన్న బంగ్లాదేశ్, ఐసీసీకి లేఖ